కాజల్కు 2 కోట్లు?
నటి కాజల్ అగర్వాల్ ఇప్పుడు యమ సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఉంది. తమిళంలో యువ సూపర్స్టార్ ధనుష్ హీరోగా నటించిన ‘మారి’ చిత్రంలో కాజలే కథానాయిక. రంజాన్ కానుకగా ఈ నెల 17న ఆ సినిమా విడుదల కానుంది. మరోపక్క తాజాగా తెలుగులో మహేశ్బాబు సరసన ‘బ్రహ్మోత్సవం’లో అనుకోని విధంగా ఛాన్సొచ్చింది. తమిళ సినిమా రిలీజ్ కోసం, తెలుగు సినిమా షూటింగ్లో పాల్గొనడం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు కాజల్ చెప్పుకొచ్చారు. ధనుష్ చాలా కూల్ అనీ, సెట్స్లో ఎంతో అండగా ఉంటారనీ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా, సుదీర్ఘమైన డైలాగులు ఉన్నప్పుడు ధనుష్ భలే సాయం చేసేవారట! ఇది ఇలా ఉండగా, ఈ మధ్య కాజల్ రెండు కోట్ల రూపాయల పారితోషికం అడుగుతున్నట్లు ఒక వార్త వినిపించింది.
ఆ డిమాండ్కు నిర్మాతలు తూగలేకపోవడం వల్లే ఆమె ఇక్కడ సినిమాల్లో కనిపించడం లేదనీ ప్రచారమైంది. కానీ, కాజల్ ఆ మాటలను కొట్టిపారేశారు. ‘‘అవన్నీ వట్టి గాలివార్తలు. నాకు తగినంత నేను అడుగుతానే తప్ప, అంత అడిగాననడం పచ్చి అబద్ధం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. హిందీతో సహా వేర్వేరు భాషల్లో నటిస్తున్నందు వల్లే ఇటీవల ఇక్కడ పెద్దగా కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం రణ్దీప్ హుడాతో ‘దో లఫ్జోం కీ కహానీ’ సినిమా కూడా అంగీకరించిన కాజల్, ‘‘అన్నిచోట్లా ఏకకాలంలో నటించడం సాధ్యం కాదుగా! దక్షిణాదిలో కొన్ని ఛాన్స్లు వచ్చినా, హిందీతో సహా ముందుగా ఒప్పుకున్న సినిమాల వల్ల ఆ ఆఫర్లు అంగీకరించలేదు’’ అని చెప్పుకొచ్చారు.