నన్ను తీవ్రంగా కలచివేస్తోంది: ఏఆర్ రెహ్మాన్
కోల్ కతా: క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఆదేశ్ శ్రీవాస్తవ్(48) ఆరోగ్య పరిస్థితిపై ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవాస్తవ్ కోలుకోవడానికి ఆ దేవుడు సాయం చేయాలంటూ రెహ్మాన్ కన్నీటి పర్యంతమయ్యారు. క్యాన్సర్ బారిన పడ్డ శ్రీవాస్తవ్ గత 45 రోజుల నుంచి కోకిల్ బేన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్లో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు.
అయితే శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారడంతో రెహ్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు.'నీ ప్రస్తుత ఆరోగ్యపరిస్థితి విషమించిందని తెలిసి నేను షాక్ కు గురయ్యా. నీవు క్యాన్సర్ కారణంగా తీవ్రమైన బాధను అనుభవించడం కలచి వేస్తోంది. ఆ దేవుడి దీవెనలతో నీవు క్యాన్సర్ బాధ నుంచి ఉపశమనం పొందాలి' అని రెహ్మాన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. శ్రీవాస్తవకు బిగ్ బి అమితాబ్ దగ్గర్నుంచి బాద్ షా షారుఖ్ ఖాన్ వరకూ అత్యంత సన్నిహితులు. ప్రస్తుతం శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితిని షారుఖ్ ఖాన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 100 సినిమాలకు శ్రీవాస్తవ సంగీత దర్శకత్వం వహించారు. అందులో 'ఛల్తే చల్తే', బాబూల్, బాఘ్ బేన్, ఖుషీ కభీ ఘమ్, రాజ్ నీతి, దేవ్ తదితర చిత్రాలు శ్రీవాస్తవ కెరీర్ లో చెప్పుకోదగినవి.