జీవీతో సాయిపల్లవి రొమాన్స్

జీవీతో సాయిపల్లవి రొమాన్స్ - Sakshi


జీవీ ప్రకాశ్‌కుమార్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది నటి సాయిపల్లవి. మలయాళ చిత్రం ప్రేమమ్‌తో ఒక్క సారిగా పాపులరైన ముగ్గురు హీరోయిన్లలో నటి సాయిపల్లవి ఒకరని చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా ఇద్దరిలో మడోన్నా సెబాస్టియన్ ఇప్పటికే కోలీవుడ్‌కు పరిచయమై కాదలుమ్ కడందుపోగుమ్ చిత్రంతో విజయాల ఖాతా ఓపెన్ చేసుకున్నారు. ఇక మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్‌లో అవకాశాలను అందుకుంటున్నారు.



ఆమె నటించిన తెలుగు చిత్రం అఆ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా సాయిపల్లవి మాత్రం ఇతర భాషల్లోకి రంగప్రవేశం చేయలేదు. అయితే అవకాశాలు మాత్రం వస్తున్నాయి. ఇటీవల ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రంలో కార్తీకి జంటగా నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అది ఈ బ్యూటీని నిరాశపరచే సంఘటనే అయినా తాజాగా లక్కీ ఛాన్స్ సాయిపల్లవిని వరించింది. సక్సెస్‌ఫుల్ యువనటుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌తో జతకట్టే అవకాశం అభించింది.



డార్లింగ్ అంటూ కథానాయకుడిగా తెరపైకి వచ్చిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్. ఆ చిత్రంతో పాటు, ఆ తరువాత విడుదలైన త్రిష ఇల్లన్నా నయనతార, పెన్సిల్ చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. దీంతో ఆయనకు హీరోగానూ పలు అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం జీవీ నటించిన బ్రూస్‌లీ, ఎనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రాలు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి.



తాజాగా జీవీ మరో చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి రాజీవ్‌మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు మిన్సారకనవు, కండుకొండేన్ కండుకొండేన్ చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సాయిపల్లవి నాయకిగా ఎంపికైనట్లు తాజా సమాచారం. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి ఆస్కార్  అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని తెలిసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top