నా మనసుకు అనిపించిందే చేస్తా!

నా మనసుకు అనిపించిందే చేస్తా!


నా మనసుకు ఏది అనిపిస్తే అదే చేస్తాను అంటున్నారు నటి శ్రుతీహాసన్.ప్రస్తుతం టాప్‌ మోస్ట్‌ కథానాయకిగా వెలుగొందుతున్న ఈ బోల్డ్‌ బ్యూటీ మొదట్లో గాయనిగా, ఆ తరువాత సంగీతదర్శకురాలిగా పరిచయం అయ్యారన్న సంగతి తెలిసిందే.


ఆ తరువాతే కథానాయకిగా తెరపైకి వచ్చారు. ప్రముఖ నటుడు కమలహాసన్  కూతురు అనే ముద్రతో రంగప్రవేశం చేసిన శ్రుతీ ఇప్పుడు ఆమె తండ్రి కమల్‌ అనేంతగా ఎదిగిపోయారు. తమిళ అమ్మాయి అయినా ఆదిలో బాలీవుడ్‌లో నటిగా పరిచయం అయ్యి, ఆ తరువాత టాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేసి, ఆపైనే కోలీవుడ్‌కు విచ్చేశారు.ఈ మూడు భాషల్లోనూ తొలి చిత్రాలు నిరాశపరచినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయాలను సొంతం చేసుకున్నారు.


ఇటీవల సూర్యకు జంటగా నటించిన సీ–3 చిత్ర విజయంతో తన సక్సెస్‌ పయనాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్న శ్రుతీహాసన్ మాట్లాడుతూ తనను శక్తిమంతురాలిగా తయారు చేసింది సినిమానేనని పేర్కొన్నారు. నటిగా తానీ స్థాయికి చేరుకున్నా.. ఇప్పటికీ కమలహసన్, సారికల కూతురు అనే గుర్తింపునే కోరుకుంటున్నానన్నారు. కాగా ఇటీవల ఈ ముద్దుగుమ్మ గురించి చాలానే గాసిప్స్‌ ప్రచారం అవుతున్నాయి.


హాలీవుడ్‌ నటుడితో చెట్టాపట్టాల్ అంటూ ప్రచారం జోరందుకుంది. అలాంటి వాటి గురించి స్పందిస్తూ తన గురించి ఎవరేమనుకున్నా, నా మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తాననీ చెప్పారీ అమ్మడు. నటిగా తన వయసు ఎనిమిదేళ్లు అనీ, ఈ కాలంలో తనకు సినిమా చాలానే నేర్పిందనీ చెప్పుకొచ్చారు. ఒక పరిణితి చెందిన నటిగా మంచి పాత్రలను ఎంచుకుని మరింత మంచి పేరు తెచ్చుకోవాలన్నదే తన ఆశ అని శ్రుతి పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రుతి తెలుగులో పవన్ కల్యాణ్‌ సరసన కాటమరాయుడు, తన తండ్రి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం శబాష్‌ నాయుడు చిత్రంతో పాటు మరో హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top