నిర్మాత శేఖర్‌బాబు మృతి

నిర్మాత శేఖర్‌బాబు మృతి


ప్రముఖ నిర్మాత కేసీ శేఖర్‌ బాబు (71) శనివారం మృతి చెందారు. హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని స్వగృహంలో తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. 1946 జనవరి 5న కృష్ణాజిల్లా గన్నవరంలోని కోలవెన్నులో కంచర్ల నారాయణరావు, కమలాదేవి దంపతులకు జన్మించారు శేఖర్‌బాబు. తండ్రి చిత్ర పంపిణీ రంగంలో ఉండటంతో ఇంటర్‌ తర్వాత శేఖర్‌బాబు కూడా సినీ రంగంలోకి ప్రవేశించారు. 1973లో కృష్ణ, జమున కాంబినేషన్‌లో ‘మమత’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథ రాసింది ఆయనే. ఆ తర్వాత ‘సంసార బంధం’, ‘గోపాలరావుగారి అమ్మాయి’, ‘పక్కింటి అమ్మాయి’ వంటి సినిమాలు నిర్మించారు.


కృష్ణంరాజుతో ‘జగ్గు’, ‘సర్దార్, సాహస సామ్రాట్‌’, చిరంజీవితో ‘ముఠామేస్త్రీ’ వంటి చిత్రాలు నిర్మించారు. దాదాపు అన్ని చిత్రాలనూ వేరే నిర్మాతలతో కలసి నిర్మించారు. ఫిలిం సెంట్రల్‌ బోర్డ్‌ చైర్మన్‌గా, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్రటరీగా పనిచేసిన ఆయన గత కొంత కాలంగా దక్షిణాది ఫిలించాంబర్‌ కమిటీ మెంబర్‌ పదవిలో ఉన్నారు. ఆయన మృతిపట్ల చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు దిగ్భా్రంతి వ్యక్తం చేశారు. శేఖర్‌బాబుకి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోమవారం ఆయన ఆంత్యక్రియలు జరగనున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top