లింగా నష్ట పరిహారం చెల్లిస్తాం

లింగా నష్ట పరిహారం చెల్లిస్తాం - Sakshi


సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లింగా చిత్రప్రదర్శనలో డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టాన్ని చెల్లించేందుకు ఆ చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ అంగీకరించారు. భారీ అంచనాలతో నిర్మితమైన లింగా చిత్రానికి ఫ్యాన్సీ రేట్లు చెల్లించి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. అయితే అనుకోని విధంగా చిత్రం ఘోర పరాజయం పాలైంది. చిత్ర హీరో రజనీకాంత్ జోక్యం చేసుకొని తమకు జరిగిన నష్టాన్ని భర్తీ అయ్యేలా చూడాలని డిస్ట్రిబ్యూటర్లు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.



ఇందుకు చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తొలుత అంగీకరించలేదు. అయితే డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన తీవ్రతరం కావడంతో రజనీ జోక్యం చేసుకోక తప్పలేదు. నష్టపరిహారం చెల్లించాలని నిర్మాతలను రజనీ కోరగా అందుకు వారు అంగీకరించారు. లింగా డిస్ట్రిబ్యూటర్లు తమకు జరిగిన నష్టం లెక్కల వివరాలను నిర్మాతకు అందజేశారు. మరో మూడు రోజుల్లో చెల్లింపులు జరుగుతాయని తెలుస్తోంది. తన చిత్రాల వల్ల ఎవరూ నష్టపోరాదని భావించిన రజనీకాంత్ గతంలో బాబా చిత్రానికి జరిగిన నష్టాన్ని పూర్తిగా తానే చెల్లించారు. అయితే లింగా చిత్రానికి నష్టంలో కొంతభాగం చెల్లిస్తారని తెలుస్తోంది. నిర్మాత నుంచి సొమ్ము ముట్టిన తరువాత మీడియా సమావేశం పెట్టి రజనీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమవుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top