అభిమానులు క్షమించండి: రాజమౌళి
హైదరాబాద్ : అనివార్య కారణాల వల్ల 'బాహుబలి' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం వాయిదా పడింది. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి గురువారం ప్రకటించారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, అభిమానులు క్షమించాలని ఆయన కోరారు. దర్శకుడు రాజమౌళి, నిర్మాతలతో కలిసి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. భారీ ప్రెస్మీట్ పెట్టి సినిమా విశేషాలను ప్రకటించాలనుకున్నామని, అయితే ఊహించని రీతిలో అభిమానులు తరలి రానున్నారని వారికి అసౌకర్యం కలిగించకూడదనే ఆ ప్రెస్మీట్ను రద్దు చేసినట్లు చెప్పారు.
ప్రభాస్ అభిమానులు బాహుబలి ఆడియో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారని, భద్రతాపరమైన కారణాలతో ఆడియో ఫంక్షన్ కు పోలీసులు నియంత్రణలు విధించారని, దానివల్ల కొంతమంది వేదిక బయటే వేచి ఉండే పరిస్థితి ఏర్పడుతుందని, అలా కాకుండా . ప్రభాస్ను ఫ్యాన్స్ దగ్గరకు తీసుకు వెళ్లడమా, ఫ్యాన్స్ను ప్రభాస్ దగ్గరకు తీసుకు వెళ్లటమా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అది ఎలా చేస్తామో, ఏవిధంగా చేస్తామనే దానికి ప్రస్తుతానికి క్లారిటీ లేదని రాజమౌళి తెలిపారు. ఈనెల 31న జరగాల్సిన ఆడియో వేడుకను జూన్ మొదటి వారానికి వాయిదా వేసినట్లు చెప్పారు.