చిరంజీవి 'కత్తి'లాంటోడు ప్రారంభం
ఎప్పుడెప్పుడా అని అభిమానులందరూ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరూ పండగ చేసుకున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా చిరంజీవి మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. రీ-ఎంట్రీ సినిమా కోసం గత కొన్నాళ్లుగా ఫిజికల్ ఫిట్నెస్ కోసం వర్కవుట్స్ చేసిన చిరంజీవి కత్తిలా కనిపించారు. చాలా విరామం తర్వాత తండ్రి నటిస్తున్న ఈ సినిమాని తనయుడు రామ్చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్స్’ పతాకంపై నిర్మిస్తున్నారు.
వీవీ వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రారంభోత్సవంలో చిరంజీవిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కెమేరా స్విచాన్ చేయగా, ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు గౌరవ దర్శకత్వం వహించారు. తమిళ చిత్రం ‘కత్తి’ కథ తన రీ-ఎంట్రీకి తగ్గట్టుగా ఉంటుందని చిరంజీవి ఆ కథనే ఎంచుకున్నారు. దీనికి ‘కత్తిలాంటోడు’ని టైటిల్గా అనుకున్నట్లు వార్త వచ్చింది కానీ, ప్రారంభోత్సవం నాడు టైటిల్ను ప్రకటించలేదు. కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమేరా: రత్నవేలు.