బాలకృష్ణ వందో సినిమా ఎవరితో?

బాలకృష్ణ వందో సినిమా ఎవరితో? - Sakshi


క్రికెట్‌లో సెంచరీలాగా, సినిమా ఫీల్డ్‌లో వంద సంఖ్యకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. తమ సినిమా వంద రోజులు ఆడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాగే ఒక నటుడు వంద సినిమాలు పూర్తి చేయడమనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. బాలకృష్ణ కూడా ఇలాంటి ముఖ్య ఘట్టానికి చేరువలో ఉన్నారు. అతి త్వరలోనే ఆయన వందో సినిమా శ్రీకారం చుట్టుకోనుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 99వ చిత్రం ‘డిక్టేటర్’ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.



ఒకవైపు ఆ సినిమా కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తూ, మరోవైపు బాలకృష్ణ నూరవ చిత్రం విశేషాలు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. ఆ చిత్రానికి దర్శకుడెవరనే అంశంపై కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు... మరొకరు యువదర్శకుడు బోయపాటి శ్రీను. బాలకృష్ణతో సింగీతం తీసిన ‘ఆదిత్య 369’ ఓ మెమరబుల్ మూవీ. ఆ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచింది.



ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా బాలకృష్ణతో ‘ఆదిత్య 999’ తీయాలన్నది సింగీతం ఆకాంక్ష. ఆ మధ్య టూకీగా బాలకృష్ణకు లైన్ కూడా చెప్పారట. ఆ లైన్ బాగా నచ్చిందనీ, వందో చిత్రం ఇదే అవుతుందనీ ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇక, బోయపాటి గురించి చెప్పాలంటే.. బాలకృష్ణతో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి రెండు సూపర్ డూపర్ హిట్ చిత్రాలు ఇచ్చారాయన.



సో.. వందో చిత్రానికి కూడా బోయపాటియే దర్శకత్వం వహిస్తారనే టాక్ ఉంది. దర్శకుడెవరైనా.. ఈ చిత్రాన్ని నిర్మించబోయేది మాత్రం ఈరోస్ సంస్థ అని సమాచారం. మరోపక్క సాయి కొర్రపాటి పేరు కూడా వినిపిస్తోంది. ‘డిక్టేటర్’ విడుదల తర్వాత నూరవ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారట. మరి.. సింగీతం పేరు చెబుతారో? బోయపాటికే ఫిక్స్ అవుతారో.. ఈ ఇద్దరూ కాకుండా వేరే దర్శకుణ్ణి ఎంపిక చేస్తారో చూడాలి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top