ప్రతీకారంగానే కుట్ర: బాహుబలి లీకేజీ కేసు
మకుట విజ్వల్ సంస్థపై కోపంతోనే బాహుబలి చిత్రంలోని సన్నివేశాలను లీక్ చేసేందుకు ఆ సంస్థ విజువల్స్ ఎఫెక్ట్ మేనేజర్గా పనిచేసిన వర్మ కుట్రపన్నినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి 13 నిమిషాల నిడివిగల ఎడిట్ చేసిన సినిమా లీకైన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ప్రధాన దృశ్యాలను శర్మ నెట్లోకి అప్ లోడ్ చేశాడు. మూడు రోజులపాటు ఇది నెట్లో హల్చల్ చేసింది. ఈ విషయమై సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాత సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 180 కోట్ల బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలోంచి 13 నిమిషాల నిడివిగల సన్నివేశాలు లీకవ్వడం పట్ల టాలీవుడ్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
భారీ బడ్జెట్ సినిమాల సక్సెస్పైనా అంతే అంచనాలు ఉంటున్నాయి. విడుదలకు ముందే అనేక విధాల సంచనాలు సృష్టిస్తున్నాయి. ఏళ్ళ తరబడి షూటింగ్లు, రిలీజ్కు ముందే లీకులు, ఆపై పోలీసులకు ఫిర్యాదులు.... ఈ మధ్య టాలీవుడ్లో కొనసాగుతున్న ట్రెండ్ ఇది. అత్తారింటికి దారేది సినిమా ఘటన మరవకముందే, బాహుబలి సినిమా రూపంలో మరోమారు టాలీవుడ్పై లీకేజ్ పంజా విసిరింది. తాజాగా సంచనలం రేపిన బాహుబలి సినిమా సీన్స్ లీకేజీ కేసును పోలీసులు త్వరితగతిన చేధించారు. ఒకరి అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు.
బాహుబలి సినిమా విడుదలకు ముందే కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో హల్ చేయడంతో సినిమా యూనిట్ ఆందోళనకి గురైంది. కేసును సవాలుగా తీసుకున్న సీసీఎస్ పోలీసులు 24 గంటల్లోపే పురోగతిని సాధించారు. గతంలో మకుట విజువల్స్ ఎఫెక్ట్ మేనేజర్గా పనిచేసిన వర్మే నిందితుడని గుర్తించారు. పోలీసు స్టైల్లో విచారించడంతో అసలు నిజాలు బయటకొచ్చాయి. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో వర్మ బాహుబలి సినిమాలోని కొన్ని దృశ్యాలను ల్యాప్టాప్లోకి కాఫీ చేశాడు. ఆ తర్వాత వాటిని వాట్స్యాప్, ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్స్కు షేర్ చేశాడు. సంస్థపై కోపంతోనే వర్మ లీకేజీకి పాల్పడ్డట్టు తెలిసింది. మకుట విజ్వల్ సంస్థలో పనిచేస్తున్నప్పుడు తనకు జరిగిన అనుభావాలకు ప్రతీకారంగానే ఈ కుట్ర చేసినట్టు సమాచారం.
ఈ కేసుతో సంబంధం ఉన్న మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చిత్రపరిశ్రమ పోలీసులను అభ్యర్థించింది. ఇంత భారీ బడ్జెట్ చిత్రాలు లీకైతే ఆ నిర్మాతల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.