'బాహుబలి' ఆడియో ఫంక్షన్ వాయిదా: ప్రభాస్
హైదరాబాద్: అభిమానులు సంతృప్తి పడేలా 'బాహుబలి' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని హీరో ప్రభాస్ తెలిపారు. ఆడియో ఫంక్షన్ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. దర్శకుడు రాజమౌళి, నిర్మాతలతో కలిసి ప్రసాద్ ల్యాబ్స్ లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని బాగా చేద్దామని ప్లాన్ చేశామని, కానీ భద్రతాపరమైన కారణాలతో ఆడియో ఫంక్షన్ కు పోలీసులు నియంత్రణలు విధించారని చెప్పారు. పోలీసులు విధించిన నియంత్రణల కారణంగా అభిమానులు అందరూ ఆడియో ఫంక్షన్ చూసే అవకాశం కలగదన్నారు.
చాలా మంది బయటే ఉండిపోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఈనెల 31న జరగాల్సిన ఆడియో వేడుక వాయిదా వేశామని తెలిపారు. అభిమానులను అసంతృప్తిని గురి చేసినందుకు క్షమాపణ చెప్పారు. అవసరమైతే తానే అభిమానుల వద్దకు వెళ్తానని ప్రభాస్ చెప్పారు. చేసేది బాగా చేస్తామని నిర్మాత తెలిపారు.