అజిత్‌తో ఆ ఇద్దరు

అజిత్‌తో ఆ ఇద్దరు - Sakshi


సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్‌ల తరువాత హీరోయిన్స్ జత కట్టాలని ఆశ పడేది అజిత్‌తోనే. ఆయనతో ఒక్క చిత్రంలోనైనా నటించాలని కోరుకోని హీరోయిన్ ఉంటారని అనుకోలేం. ప్రస్తుత ప్రముఖ నటీమణుల్లో నయనతార, అనుష్క, త్రిష లాంటి వారందరూ అజిత్‌తో రొమాన్స్ చేసినవారే. ఇప్పటికీ అలాంటి అవకాశం రాని వారిలో నటి కాజల్ అగర్వాల్ ఒకరు. ఆమెకు తాజాగా ఆ అవకాశం వచ్చిందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.



వేదాళం చిత్రం తరువాత కాలుకు శస్త్ర చికిత్స, ఫ్యామిలీతో విహార యాత్ర అంటూ చిన్న విరామం తరువాత అజిత్ తాజా చిత్రానికి రెడీ అవుతున్నారు. తన 57వ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మించడానికి సిద్ధం అయ్యింది. వీరం, వేదాళం చిత్రాల దర్శకుడు శివ మూడోసారి అజిత్‌ను డెరైక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో అజిత్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని తెలిసింది. అందులో ఒకరు అందాలభామ అనుష్క అని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.



కాగా మరో హీరోయిన్‌గా నటించే అవకాశం నటి కాజల్ అగర్వాల్‌కు దక్కిందని తెలిసింది. ఈ బ్యూటీ కూడా ఇటీవల ఒక భేటీలో త్వరలో అజిత్‌కు జంటగా నటించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో అజిత్ తాజా చిత్రంలో అనుష్క, కాజల్‌అగర్వాల్ డ్యూయెట్లు పాడడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మంచి కమర్షియల్ అంశాలతో భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ 60 శాతం విదేశాలలో జరుపుకోనుందని సమాచారం. చిత్రం షూటింగ్ ఈ జూన్ నెలలో ప్రారంభం కానుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top