ప్రధాని మోదీపై ప్రముఖ నటి విమర్శలు

ప్రధాని మోదీపై ప్రముఖ నటి విమర్శలు - Sakshi


చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు సమస్యలను పట్టించుకోవడం లేదని దక్షిణాది నటి గౌతమి విమర్శించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ చేయాలన్న డిమాండ్‌ తో సహా తమిళనాడులో ఏర్పడిన పలు సమస్యలపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారని తప్పుపట్టింది. గౌతమి ఈ మేరకు ప్రధానికి ఓ బహిరంగ లేఖ రాసింది. గతంలో రాసిన లేఖపై సమాధానం ఎందుకు ఇవ్వలేదని ఇందులో ప్రశ్నించింది.



'డిజిటలైజేషన్‌కు చాంపియన్‌ను అని ప్రధాని మోదీ స్వయంగా చెబుతారు. అంతేగాక సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవాలని దేశ ప్రజలకు చెబుతారు. అలాంటిది గతంలో నేను రాసిన లేఖకు మోదీ ఇంకా స్పందించలేదు. భారతదేశమంతా తనకు ఒకటేనని మోదీ భావిస్తే.. దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులోని సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదు?' అని గౌతమి లేఖలో పేర్కొంది. జయలలిత మృతిపై వచ్చిన సందేహాలను నివృత్తి చేసేందుకు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది.



తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని, తమిళనాడుకు న్యాయం చేయాలని కోరింది. తమిళనాడును పలు సమస్యలు పీడిస్తున్నాయని, వీటిపై దృష్టిసారించి రాష్ట్రానికి న్యాయం చేయాలని విన్నవించింది. జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోజుల్లో ఆమె ఆరోగ్యంపై గోప్యత పాటించారని, సందర్శించేందుకు వచ్చిన ప్రముఖులకు ఆమెను చూపించలేదని, ఆమె ఆరోగ్యం, మృతిపై పలు సందేహాలున్నాయని గతంలో గౌతమి ప్రధానికి లేఖ రాసింది. పీఎంఓ నుంచి దీనికి సమాధానం రాకపోవడంతో ఆమె మరో లేఖ సంధించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top