రోడ్డు ప్రమాదం.. ఇద్దరు నటులు దుర్మరణం




ముంబయి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నటులు అక్కడిక్కడే మృతిచెందారు. షూటింగ్‌లో పాల్గొని తిరిగి వెళ్తుండగా బుల్లితెర నటులు గగన్‌ కాంగ్(38)‌, అర్జిత్‌ లావానియా(30)లు ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం అహ్మదాబాద్‌- ముంబయి రహదారిపై పాల్‌ఘార్‌ జిల్లాలోని మనోర్‌ వద్ద ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 'సంకటమోచన్‌ మహాబలి హనుమాన్‌' సీరియల్‌లో నటిస్తున్న గగన్‌ కాంగ్‌, అర్జిత్‌ లావానియాలు మరో సీరియల్ 'మహాకాళీ' షూటింగ్‌ పనులతో బిజీగా ఉన్నారు.



హనుమాన్‌ సీరియల్‌ తో పాపులర్ అయిన గగన్‌ 'మహాకాళీ'లో ఇంద్రుడి పాత్ర పోషిస్తుండగా, అతడి సహ నటుడు అర్జిత్‌ లావానికియా నందిగా నటిస్తున్నాడు. శుక్రవారం ఏకధాటిగా భారీ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొన్న వీరు.. శనివారం ఉదయం షూటింగ్‌ ముగించుకుని ముంబయి బయల్దేరినట్లు సీరియల్ యూనిట్ సభ్యులు చెప్పారు. గగన్‌ కాంగ్ కారు నడుపుతుండగా, అర్జిత్ అతడి పక్క సీట్లో కూర్చున్నాడు. కారు పాల్‌ఘార్ జిల్లాలో మనోర్ వద్దకు రాగానే ఓ కంటైనర్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top