జూ.ఆర్టిస్టుతో భరత్ అంత్యక్రియలు?
హైదరాబాద్: సినీనటుడు భరత్ అంత్యక్రియలకు ఆయన సోదరుడు రవితేజ సహా చాలా మంది కుటుంబీకులు హాజరుకాకపోవడంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ప్రమాదంలో భరత్ ముఖం పూర్తిగా ఛిద్రమైపోయినందున అది చూసి మేం తట్టుకోలేమని, అందుకే అంత్యక్రియలకు రాలేనని రవితేజ ప్రకటించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్మార్టం అనంతరం భరత్ పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానానికి తీసుకెళ్లారు.
జూనియర్ ఆర్టిస్టుతో తలకొరివి..?
కుటుంబ సభ్యులెవరూ రాలేని(!) పరిస్థితిలో భరత్ భౌతిక కాయానికి ఓ జూనియర్ ఆర్టిస్టుచేత అంత్యక్రియలు జరిపించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం అతనికి రూ.1500 ఇచ్చినట్లు, పిల్లల స్కూలు ఫీజుల కోసమే అతనా పని చేయడానికి ముందుకొచ్చినట్లు, ఈ విషయం జూనియర్ ఆర్టిస్టే స్వయంగా చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. డ్రగ్స్, మద్యానికి బానిసై, కుటుంబ సభ్యుల మాటలను పెడచెవిన పెట్టడం వల్లే.. అందరూ ఉండికూడా భరత్ అనాధలా పోవాల్సివచ్చిందనే చర్చకూడా నడుస్తోంది.
రవితేజ మూడో సోదరుడు రఘు అంత్యక్రియలను పర్యవేక్షించారు. అంత్యక్రియలకు నటులు ఉత్తేజ్, జీవిత రాజశేఖర్, నటులు ఆలీ, రఘుబాబు, కుటుంబ సభ్యులు, కొద్ది మంది మిత్రులు, పరిచయస్తులు మాత్రమే హాజరయ్యారు.
శంషాబాద్ మండలం కొత్వాల్గూడ, ఔటర్ రింగ్ రోడ్డుపై భరత్ ప్రయాణిస్తున్న ఆయన కారు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో భరత్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.