ఏడుస్తున్నారని పిల్లల పీక నొక్కిన తల్లి
వాషింగ్టన్: పిల్లలు అల్లరి చేస్తున్నా, అరుస్తున్నా ఏం చేస్తాం.. వాళ్లను ఊరుకోబెడతాం, లేదా మరీ కోపం వస్తే రెండు తగిలిస్తాం. కానీ అప్పుడు వాళ్ల ఏడుపు మరింత ఎక్కువవుతుంది కదూ. కానీ.. సెలవురోజున పిల్లలు ఏడుస్తున్నారని ఓ మహాతల్లి ఏకంగా వాళ్ల పీకలు పిసికేసింది. క్రిస్టియానా బూత్, థామస్ బూత్లకి ముగ్గురు సంతానం. రెండేళ్ల వయసున్న ఒక పాప, 6 నెలల వయసున్న ఇద్దరు కవలలు ఉన్నారు. సెలవు రోజు పిల్లలు ఏడుస్తున్నారనే చికాకుతో తల్లి క్రిస్టియానా వైద్య సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేసింది.
వారి ఇంటికి పోలీసులు చేరుకునే సరికి మంచం పై ఉన్న కవలలిద్దరి గొంతు నుంచి రక్తం వస్తూ, వాళ్లు ఏడుస్తూ ఉండటం గమనించారు. మరో పోలీసు అధికారి రెండో అంతస్తు వెళ్లి చూసే సరికి రెండేళ్ల పాప కూడా ఎండిన రక్తపు మరకలతో మంచం పై కనిపించింది. ముగ్గురు పిల్లలను హుటాహుటిన దగ్గర్లోని ఆస్సత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. పిల్లల తల్లిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.