ఆమె తన అంత్యక్రియలు చూసి అవాక్కయింది

ఆమె తన అంత్యక్రియలు చూసి అవాక్కయింది


ఆస్ట్రేలియా: వారిద్దరు ఒకే చోటపనిచేశారు. ఒకరిని చూసి ఒకరు మెచ్చుకొని మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రేమ వరకు వచ్చిన వారి బంధాన్ని పెళ్లితో పెనవేసుకున్నారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా ముగ్గురు పిల్లలు కూడా. కానీ, తన ప్రేయసి(భార్య)ని అనుమానించిన అలనాటి ప్రేమికుడు(భర్త) ఆమెను చంపేయమని కిరాయి మనుషులను పెట్టాడు. అనంతరం తన భార్య ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని బుకాయించి కర్మలు కూడా జరిపించాడు.



కానీ, ఎవరికైతే డబ్బులిచ్చి తన భార్యను హత్య చేయాలని చెప్పాడో వారు ఆమెను హత్య చేయకుండా అసలు విషయం చెప్పడంతో ఆమె గుండె బద్ధలైంది. ఆ కోపంతో తన భర్తపై దాడి చేయాలన్నంత కసి ఏర్పడింది. కానీ, ఆమెకు కర్మలు జరిపిస్తున్నాడని తెలిసి అవి పూర్తయ్యే వరకు ఎదురు చూసి.. చివరకు భర్తను పోలీసులకు పట్టించింది. ఇదంతా ఆస్ట్రేలియాలో కాంగో నుంచి వలస వచ్చిన ఇద్దరు భార్యభర్తలుగా మారిన ప్రేమికుల కథ. బాలెంగా కాలాల అనే వ్యక్తి, నోయెలా రుకుండో అనే ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.



అయితే, ఓసారి నోయెలా పెంపుడు తల్లి చనిపోవడంతో ఆమె అంత్యక్రియలకు బురుండి వెళ్లింది. అక్కడే బుజుంబురా అనే ప్రాంతంలో ఓ హోటల్ లో ఉండిపోయింది. అప్పటికి తన భార్యను అనుమానించడం మొదలు పెట్టిన బాలెంగా తన భార్య తనను మోసం చేస్తుందని భావించి కిరాయి హంతకులకు డబ్బులు ఇచ్చి ఆమెను హత్య చేయాలని చెప్పాడు. దీంతో ఆమెను వారు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి ఎత్తుకెళ్లారు. అయితే, తాము ఒక మహిళను చంపలేమని, పైగా ఆమె సోదరుడు తమకు తెలుసని చెప్పడమే కాకుండా ఆమె భర్తే తనను చంపేందుకు డబ్బులిచ్చాడని రశీదు చూపించడమే కాకుండా హత్యకు సంబంధించి మాట్లాడిన మాటలు వినిపించారు. దీంతో ఆమె గుండె బద్ధలైంది. హంతకులు తాము హత్య చేసినట్లు అబద్ధం చెప్పారు. బాలెంగా తన భార్య ఆఫ్రికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని బంధువులందరినీ నమ్మించి కర్మలు కూడా ఏర్పాటు చేశాడు.



అప్పటికే అక్కడికి చేరుకున్న బాలెంగా భార్య తన భర్త చేస్తున్న పనిని చూసి అతడిని ఏమి అనకుండా ఆ కార్యక్రమం పూర్తయ్యి బంధువులు వెళ్లిపోయేవరకు ఎదురుచూసింది. అనంతరం అతడికి ఒక్కసారిగా తారసపడింది. దీంతో అతడు అవాక్కయ్యాడు. దెయ్యం, ప్రేతాత్మ తన వద్దకు వచ్చిందా? ఇది నిజంగా నిజమేనా అని వణికిపోతూ భయంభయంగా ఆమె భుజాలను తాకాడు. ఆమె స్పర్ష అతడికి తెలియడంతో గట్టిగా కేకలు వేశాడు. జరిగిన దానికి కుమిలికుమిలి ఏడుస్తూ తనను క్షమించమని ప్రాథేయపడ్డాడు. కానీ, అప్పటికే చాలా ఆసల్యం అయిందని చెప్పిన రుకుండో మనసులో భర్తపై ప్రేమ ఉన్నప్పటికీ పోలీసులకు పట్టించింది. దీంతో అతడికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష పడింది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top