థాయ్తో బంధం బలోపేతం
సుష్మ పర్యటనలో కీలక ఒప్పందాలు
బ్యాంకాక్: భారత్, థాయ్లాండ్ మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందం(డీటీఏటీ)తోపాటు నేరగాళ్ల అప్పగింత ఒప్పందానికి సంబంధించిన లాంఛనాలు పూర్తయ్యాయి. థాయ్లాండ్లో మూడ్రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజైన సోమవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య సహకారానికి ఉద్దేశించిన భారత్-థాయ్లాండ్ 7వ సంయుక్త కమిషన్ సమావేశంలో సుష్మ పాల్గొన్నారు.
ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలపై సుష్మ, థాయిలాండ్ డిప్యూటీ ప్రధాని, విదేశాంగమంత్రి జనరల్ తనాసాక్ పాటిమప్రాగోర్న్ సంతకాలు చేశారు. డీటీఏటీతో ద్వైపాక్షిక వాణిజ్యం కొత్త పుంతలు తొక్కుతుందని భావిస్తున్నారు. రెండుదేశాల మధ్య నేరగాళ్ల అప్పగింత ఒప్పందం 2013లోనే కుదిరింది. తాజాగా అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ ఒప్పందంతో ఉగ్రవాదులు, ఆర్థిక నేరగాళ్లు, స్మగర్లను, వాంటెడ్ క్రిమినల్స్ పట్టుబడితే పరస్పరం అప్పగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది.
ఇరుదేశాల్లోని భద్రతా సంస్థల మధ్య కూడా సహకారానికి దారులు పరుస్తుంది. బిహార్లో నలంద యూనివర్సిటీ ఏర్పాటులో సహకారానికి, థాయ్లాండ్లోని రంగ్సిట్ యూనివర్సిటీలో ఆయుర్వేద విభాగం ఏర్పాటుకు కూడా ఇరు దేశాల ఎంవోయూలు కుదిరాయి. సుష్మ పర్యటనతో భారత్-థాయ్లాండ్ దేశాల భవిష్యత్తుకు బలమైన పునాదులు పడ్డాయని విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ పేర్కొన్నారు.