వైట్హౌస్ వద్ద కూలిన డ్రోన్.. విచారణ
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉండే అమెరికా అధ్యక్షుడి అధికార నివాస భవనం వైట్హౌస్ వద్ద డ్రోన్ కూలిపోవడం అధికారులను విస్మయం కలిగిస్తోంది. సోమవారం జరిగిన ఈ ఘటనను సీక్రెట్ సర్వీస్ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
అతనే డ్రోన్ను కూల్చినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే వైట్హౌస్ ప్రహారీ గోడ మీదుగా డ్రోన్ను వెళ్తుందని తాను ఊహించలేకపోయానని వివరించాడు. దాన్ని కంట్రోల్ చేయడంలో విఫలమవడంతో వైట్ హౌస్ వద్ద కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. భద్రత అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. కాగా డ్రోన్ కూలిన సమయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు భారత పర్యటనలో ఉన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఒబామా దంపతులు భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత నిఘా, పటిష్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్షుడి నివాసం భవనంలో డ్రోన్ కూలడం.. భద్రత లోపాలను ఎత్తిచూపుతోంది.