ఆ జైలు ఓ నరకం..
గాలి కూడా ఆడనట్లుగా.. కుక్కేసినట్లుగా.. మెట్ల మీద.. బాత్రూంల దగ్గర
ఎక్కడ పడితే అక్కడ.. జనం.. జనం.. పొర్లాడుతూ..
కూడు, గూడు (చిన్నపాటి స్థలం), గుడ్డ కోసం కొట్లాడుతూ..
వెల్కం టు మనీలా జైల్.. నేల మీద ఉన్న నరకానికి స్వాగతం..
ఇది ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని క్విటోన్ సిటీ జైలు.. ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ జైలు సామర్థ్యం 800. ఇక్కడ ఉన్నది మాత్రం 3,600 మంది ఖైదీలు. అత్యంత దుర్భర పరిస్థితులకు నెలవు ఈ కారాగారం.. పడుకోవడానికి స్థలం లేక పక్కపక్కనే ఇరుక్కుంటూ.. బతుకు వెళ్లదీస్తుంటారు. ఇటు స్నానం.. అటు బట్టలుతకడం.. దాని పక్కనే భోజనం.. జైలులోని ఒక్కో సెల్ను 20 మంది కోసం నిర్మిస్తే.. ఇందులో 160 నుంచి 200 మంది ఉన్నారు. ఇక్కడ రోజూ బతుకు పోరాటమే. స్థలం, ఆహారం, నీటి కోసం సహచరుల మధ్య కొట్లాటలు నిత్యకృత్యం. కిక్కిరిసి ఉండటంతో వ్యాధులూ వేగంగా ప్రబలుతున్నాయి. ప్రతి నెలా ఇద్దరి నుంచి ఐదుగురు అనారోగ్యంతో మరణించడం ఇక్కడ కామనే. క్షోభకు గురై.. మానసిక వ్యాధులు బారిన పడుతున్నవారూ ఉన్నారు. కోర్టుల్లో వేలాదిగా కేసులు పెండింగ్లో ఉండటం వల్ల వీళ్ల బతుకులు కూడా ఇటు చావుకి, బతుక్కి మధ్య ‘పెండింగ్’లోనే ఉండిపోతున్నాయి.
సంబంధిత వార్తలు