ప్రయాణికులు దిగి.. విమానాన్ని తోశారు!
రన్ వే మీద నుంచి విమానం కదలట్లేదు. ట్రక్కుతో లాగినా ఫలితం కనపడలేదు. అంతే, మొత్తం ప్రయాణికులందరినీ కిందకు దించి, దాన్ని తోయమన్నారు. ఇదంతా సైబీరియాలో జరిగింది. అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 52 డిగ్రీలకు పడిపోయింది. దాంతో ఛాసిస్ కూడా గడ్డకట్టుకుపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో విమానంలోని ప్రయాణికులను కిందకు దించి తోయించారు. ఈ తతంగం అంతటినీ ఓ ప్రయాణికుడు పక్కనుండి వీడియోతీసి, దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఇగార్కా రన్వే మీద ఈ సరదా సన్నివేశం కనిపించింది.
ప్రయాణికులంతా బాగా మందపాటి కోట్లు ధరించి, తొయ్యరా బాబూ.. హైస్సా అనుకుంటూ (వాళ్ల భాషలోనే లెండి) విమానం రెక్కల మీద చేతులు ఆనించి కొన్ని మీటర్ల దూరం పాటు తోసుకెళ్లారు. ఈ సంఘటన గురించి విచారణ జరిపిస్తామని సైబీరియా రవాణా శాఖ అధికారులు చెప్పారు. టో ట్రక్కును తీసుకొచ్చినా విమానం ముందుకు కదలకపోవడంతో ఇక జనంతోటే దాన్ని తోయించాల్సి వచ్చిందని తెలిపారు. సైబీరియన్లు చాలా బలవంతులని, వాళ్లకు ఈ విమానాన్ని తోయడం పెద్ద కష్టం కాలేదని అక్కడి పత్రిక ఒకటి పేర్కొంది. యుటైర్ గ్రూపునకు చెందిన కటెకావియా ఎయిర్లైన్స్ సంస్థకు చెందిన ఈ విమానంలో అప్పటికి 74 మంది ప్రయాణికులు ఉన్నారు.