'ఆ ట్యాగ్ తగిలిస్తారేమోనని వెనక్కి తగ్గింది'
వాషింగ్టన్: భారతదేశంలో దాడులు జరిపి దేశంలో అల్లకల్లోల పరిస్థితులు సృష్టించేందుకు పాకిస్థాన్ ఎప్పుడూ తహతహలాడుతూనే ఉంటుందని మరోసారి అధికారికంగా బయటపడింది. అమెరికాకు చెందిన సీఐఏ ఈ అంశాన్ని వెల్లడించింది. గతంలో జమ్మూకాశ్మీర్లో, 1996లో లజపత్ నగర్లో బాంబు దాడులు చేయడం వంటి ఘటనలకు హరకత్ ఉల్ అన్సార్(హెచ్యూఏ) అనే పాక్ ఉగ్రవాద సంస్థ పాల్పడిందని, దానికి పాకిస్థాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ భారీ మొత్తంలో ప్రతి నెలా నిధులు సమకూర్చిందని వెల్లడించింది.
ఈ విషయం తెలిసిన అనంతరం తాము పాకిస్థాన్ను ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాల జాబితాలో చేరుస్తామని హెచ్చరించిన తర్వాత కాస్త వెనకడుగు వేసి హెచ్యూఏకు నిధులు ఆపేసిందని సీఐఏ వివరించింది. హెచ్యూఏకు భారీ మొత్తంలో నిధులు అందించి ఎప్పటి కప్పుడూ భారత్లో పెను విధ్వంసం సృష్టించాలని కుట్రపన్నిందని కూడా సీఐఏ వెల్లడించింది. భారత్ నుంచి వెళ్లే విమానాలపై కూడా దాడులు చేయాలని పాక్ కుట్ర చేసినట్లు తెలిపింది.