ఢాకాలో 9మంది ఉగ్రవాదులు హతం


ఢాకా : బంగ్లాదేశ్లో మరోసారి ఉగ్రవాదుల కలకలం రేగింది.  రాజధాని ఢాకాలోని కళ్యాణ్పూర్ ఏరియాలోని ఓ భవనాన్ని ముట్టడించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అయితే వారి చర్యలను పోలీసులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. పోలీసుల కాల్పుల్లో తొమ్మిదిమంది ఉగ్రవాదులు హతమయ్యారు. మంగళవారం ఉదయం ఢాకా నగర శివారులో జరిగిన పోలీస్ ఆపరేషన్లో తొమ్మిదిమంది మృతి చెందినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఉగ్రవాద సంస్థకు చెందిన వీరంతా ఏ గ్రూప్కు చెందినవారనే దానిపై స్పష్టత లేదన్నారు.


అలాగే మరికొందరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, కమ్యూనికేషన్ పరికరాలు, జిహాదీ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 1న ఢాకాలోని ఓ కేఫ్పై ముష్కర మూకలు దాడి చేసిన ఘటనలో 22మంది మరణించిన విషయం తెలిసిందే. మృతుల్లో చాలామంది విదేశీయులే. ఈ ఘటన అనంతరం పోలీసులు తమ దాడులను ముమ్మరం చేశారు. పెద్ద ఎత్తున ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top