ఆ జంట.. ఎవరెస్ట్ ఎక్కడం బూటకం..
ఖాట్మండుః తాము పర్వతారోహకులమని చెప్పుకున్న భారత జంటపై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. పది సంవత్సరాలపాటు నేపాల్ లోని ఎటువంటి పర్వతాలు అధిరోహించేందుకు అనుమతి లేకుండా చేసింది. పోలీసు కానిస్టేబుల్స్ గా పని చేస్తున్న ఆ భార్యా భర్తలు ఎవరెస్ట్ అధిరోహించామంటూ సమర్పించిన ఫోటోలు ఫేక్ అని తేలడంతో... అధికారులు వారిపై బ్యాన్ విధించారు.
పర్వతారోహణ అంటే ఆషామాషీ కాదు. అందులోనూ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలంటే చాలా సత్తా ఉండాలి. అందుకే ఎవరెస్ట్ ఎక్కిన వారికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది. అయితే వృత్తిరీత్యా కానిస్టేబుళ్ళయిన ఇండియాలోని పుణెకు చెందిన దినేష్, తారకేశ్వరి రాథోడ్ జంట.. తాము ఆ విజయాన్ని సాధించామంటూ చేసుకున్న అప్పీలు బూటకమని పోలీసుల విచారణలో తేలింది. వారిద్దరూ ఎవరెస్ట్ ఎక్కామంటూ మే 23న మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఇచ్చి, అందర్నీ మోసం చేసినట్లు రుజువైంది. ముందుగా వారి అప్పీలును నేపాల్ టూరిజం శాఖ అంగీకరించింది. అయితే వారి అప్పీలుపై అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలో విచారణ ప్రారంభించింది.
ప్రస్తుతం.. విచారణలో ఆ జంట తప్పుడు సాక్ష్యాలను సమర్పించినట్లుగా రుజువైందని, వారిద్దరికీ పదేళ్ళపాటు నేపాల్ లోని ఎటువంటి పర్వతాలు ఎక్కకుండా నిషేధం విధిస్తున్నామని నేపాల్ టూరిజం డిపార్ట్ మెంట్ ఛీఫ్ సుదర్శన్ ప్రసాద్ ధాకల్ తెలిపారు. మరో జంట ఎవరెస్టు ఎక్కినప్పటి ఫోటోలను సదరు పోలీసు జంట.. సూపర్ ఇంపోజ్ చేసి తామే ఎక్కినట్లుగా నమోదు చేసుకున్నారని ధాకల్ పేర్కొన్నారు. విచారణలో సైతం ఆ జంట తమకు సరిగా సహకరించలేదని, వారికి సహకరించిన మరో ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్లు ధాకల్ చెప్పారు. ప్రస్తుతం ఆ జంటకు విధించిన బ్యాన్... ఇక ముందు పర్వతారోహలకు ఓ పాఠం అవుతుందని, అంతా నిబంధనలను పాటించేందుకు సహకరిస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.