మోదీ, నేను ప్రపంచ నాయకులం
మూడు దేశాల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు నాయకులు సంయుక్త ప్రకటన చేశారు. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మోదీ తొలిసారి ఆయనతో భేటీ అవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వైట్హౌస్లో దాదాపు 20 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపిన ఇరువురు నేతలు రక్షణ, ఉగ్రవాదం, ఎనర్జీ రంగాలపై చర్చించినట్లు వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా మంగళవారం రాత్రి ట్రంప్తో కలిసి మోదీ డిన్నర్ చేస్తారని చెప్పారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ తొలి అధికారిక డిన్నర్ మోదీదే కావడం విశేషం.
సంయుక్త ప్రకటనలో మోదీ-ట్రంప్ ఇలా..
ట్రంప్:
- ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధానమంత్రిని వైట్ హౌస్లోకి ఆహ్వానించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.
- అమెరికా, భారతదేశాల రాజ్యాంగాలు రెండు 'We The People' అనే మూడు పదాలతో ప్రారంభం అవుతాయి. ప్రధానమంత్రి మోదీకి, నాకు ఈ మూడు పదాలు ఎంత ముఖ్యమైనవో తెలుసు.
- నేటి సమావేశం తర్వాత ఒక్కటే చెప్పగలను. భారత్-అమెరికాల మధ్య అనుబంధం ఇంకెప్పుడు ఇంత బలమైందిగా ఉండబోదని చెబుతున్నాను.
- మోదీ, నేను సోషల్ మీడియాలో ప్రపంచ నాయకులం.
- నేను మోదీకి సెల్యూట్ చేస్తున్నాను. నేను మీకు సెల్యూట్ చేయడానికి లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి. అందులో భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం కావడం ఒకటి.
- మరో రెండు వారాల్లో వస్తు సేవల పన్నుల(జీఎస్టీ)ను ప్రారంభించబోతున్నారు. మేం కూడా త్వరలో కొత్త పన్ను విధానాన్ని అమలు చేస్తాం.
- అవినీతిపై మీరు పోరాడుతున్నారు. ఓ అభివృద్ధి చెందుతున్న దేశానికి అవినీతి అనేది పెద్ద ప్రబంధకం.
- ఇరు దేశాల్లో ఉద్యోగాల కల్పన కోసం మీతో కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
- వ్యాపారాలను మరింత ప్రోత్సహించేందుకు ఉన్న కొన్ని అడ్డంకులను తొలగిస్తే బావుంటుంది. దీనికి తగిన విధంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను.
- ఆర్థిక రంగంలో సహకారాన్ని విస్తృతం చేసుకునేందుకు మోదీ.. నా కూతురు ఇవాంకను భారత్కు ఆహ్వానించారు.
- ఉగ్రవాదాన్ని పీచమణుద్దాం. మన ఇరు దేశాలు ఉగ్రవాదం వల్ల దెబ్బతిన్నాయి.
- అప్ఘనిస్తాన్లో తమ బలగాలు ఉండేందుకు సహకరిస్తున్న భారతీయులకు నా ధన్యవాదాలు.
- ఉత్తర కొరియా( రెండు మార్లు ఉత్తర కొరియా అంటూ నొక్కి చెప్పారు) రకరకాల సమస్యలను సృష్టిస్తోంది. ఆ దేశ కార్యకలాపాలపై దృష్టి సారించాల్సివుంది.
- అమెరికాకు విచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించింనందుకు మోదీ మీకు థ్యాంక్స్. భారత్, అమెరికాలు ఎల్లప్పుడూ స్నేహహస్తాన్ని చాస్తాయి. ఒకరిని మరొకరు గౌరవించుకుంటాయి.
మోదీ:
- ట్వీట్ల నుంచి మాటల వరకూ ట్రంప్తో నా సమయం స్నేహపూర్వకంగా గడిచింది.
- వైట్ హౌస్లో నాకు లభించిన ఘనస్వాగతానికి హృదయపూర్వక అభినందనలు.
- భారత్ గురించి మీరు చేసిన వ్యాఖ్యలకు ధన్యవాదాలు.
- ఈ రోజు మీరు చాలా సమయం వెచ్చించారు(ట్రంప్ను ఉద్దేశించి). మన ఇద్దరి మధ్య సాగిన సంభాషణలు భారత్-అమెరికాల మధ్య సంబంధాల్లో కీలకం అవుతాయి.
- భారత్, అమెరికాలకు ఒక లక్ష్యంలో సారుప్యత ఉంది. అదే ఎకానమీ. ఆర్థిక పరిపుష్టి కోసం ఇరు దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
- ఉగ్రవాదం లాంటి అంశాలపై కఠినంగా వ్యవహరిద్దాం.
- భారత్-అమెరికాల మధ్య ఉన్న అన్ని సంబంధాలపై చర్చలు జరిపాం.
- ఉత్పత్తిని పెంచడం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సాంకేతికతను కొత్త పుంతలు తొక్కించడంపై ఒకరికొకరం సాయం చేసుకుంటాం.
- నా విజన్ 'న్యూ ఇండియా'కు ట్రంప్ విజన్ 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్'లు విడివిడిగా కంటే కలివిడిగా సాగితే విజయం సాధిస్తాయని నాకు అనిపిస్తోంది.
- పెట్టుబడులపై కూడా చర్చించాం. డిజిటల్ రంగంలో కూడా భాగస్వామ్యాన్ని బలపరచుకుంటాం.
- ఉగ్రవాదాన్ని అణచేందుకు దాన్ని పాలు పెంచి పోషిస్తున్న దేశాలపై చర్యలు తీసుకోవడంపై మా నిర్ణయం ఆధారపడి ఉంటుంది.
- ఇండో పసిఫిక్ రీజియన్లో శాంతి భద్రతలను నెలకొల్పడం ఇరు దేశాల లక్ష్యం.
- నావికాదళం పరంగా అందించుకునే సాయాన్ని మరింత పెంచాలని నిర్ణయించాం.
- రక్షణకు సంబంధించిన టెక్నాలజీ, ట్రేడ్, తయారీలపై ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాం.
- మీ సారథ్యంలో(ట్రంప్ను ఉద్దేశించి) ఇరుదేశాల సంబంధాలు కొత్త ఎత్తుకు చేరతాయని ఆశిస్తున్నాను. నేను మీకు కీలక భాగస్వామిని కాగలను.
- మీరు, మీ కుటుంబ సభ్యులందరితో కలిసి భారత్ పర్యటించాలని ఆహ్వానిస్తున్నాను.
పర్యటనలో భారత్ విజయం
పాకిస్తాన్లో ఉంటున్న హిజ్బుల్ మొజాహిద్దీన్ నేత సలావుద్దీన్ను ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో కశ్మీర్లో అల్లకల్లోలానికి కారణం సలావుద్దీనేనని భారత్ చెప్తున్నవి కేవలం ఆరోపణలేననే పాకిస్తాన్ కపట వేషాలు బయటపడ్డాయి.
సలావుద్దీను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించడం పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బే. ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమెరికా వద్ద పాక్ పాచికలు పారడం లేదు.
మోదీకి రెడ్ కార్పెట్ పరిచిన ట్రంప్!
ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ల తొలి సమావేశంలో వార్మ్ షేక్ హ్యాండ్లు, కుశల ప్రశ్నలతో ప్రారంభమై.. కౌగిలింతల వరకూ వెళ్లింది. అయితే ఇవి ఏయే సమయాల్లో జరిగాయి అనే దాన్ని బట్టి చూస్తే అసలు విషయం అర్ధమవుతుంది. మొదట వైట్హౌస్ వెలుపల కారు వద్దకు మోదీని రీసీవ్ చేసుకునేందుకు ట్రంప్-మెలనియాలు వచ్చారు.
మోదీ వచ్చిన తర్వాత తొలుత షేక్ హ్యాండ్ ఇచ్చి లోపలికి ఆహ్వానించారు ట్రంప్. ఆ తర్వాత ఇరువురూ 20 నిమిషాల పైచిలుకూ ఏకాంతంగా సమావేశమయ్యారు. సమావేశానంతరం ఇరువురు నాయకుల మధ్య బంధం బలపడినట్లు కనిపించింది. సంయుక్త ప్రకటన చేస్తున్న సమయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు భవిష్యత్తులో కూడా ఇలా ఉండవేమో అనే విధంగా ఉంటాయని ట్రంప్ చెప్పారు.
తన వంతు ప్రకటన ముగిసిన తర్వాత మరోమారు మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో మోదీ మరో అడుగు ముందుకేసి తన మార్క్ హగ్ను ట్రంప్కు ఇచ్చారు. ఇలా తన ప్రసంగం అనంతరం కూడా మరోమారు హగ్ చేసుకున్నారు ఇరువురు నేతలు.