యాప్స్‌తో ప్రేమ తీరు మారింది...


లండన్: యువ‘తరం’ మారింది. ప్రేమ తీరు మారింది. ఓ కలువ బాల, ఓ వెన్నెల రేడ! అంటూ యుగళ గీతాలు గుర్తుకు తెచ్చుకోవడం, నీ కోసమే నే జీవించునది, నీ కోసమే నే తపియుంచునది! అంటూ పరస్పరం పేజీలకొద్ది కవిత్వాలు రాసుకోవడం, చలం ‘ప్రేమ లేఖలు’ ఇచ్చి పుచ్చుకోవడం నిన్నటి తరంతోనే ముగిసిపోయింది. ప్రేమ పుస్తకాలకు, కవిత్వానికి, ప్రేమ పాటలకు ఈ తరంలో పూర్తిగా కాలం చెల్లిపోయిందని, వాటి స్థానాన్ని డేటింగ్ యాప్స్ ఆక్రమించాయని లండన్‌కు చెందిన ప్రముఖ చరిత్రకారులు లూజీ వర్సిలీ తెలియజేస్తున్నారు.



అభివృద్ధి చెందిన దేశాల్లో యువతీ యువకులు పరస్పర ప్రేమ సంబంధాల కోసం ‘టిండర్’ లాంటి డేటింగ్ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారని, టిండర్‌ను 2012లో ప్రారంభించగా, ఇప్పటికే ఐదు కోట్ల మంది ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని 41 ఏళ్ల లూజీ తెలిపారు. స్మార్ట్ ఫోన్ యాప్ టిండర్ జీపీఎస్ వ్యవస్థను ఉపయోగించడం వల్ల, తమకు కాబోయే భాగస్వామి వయస్సెంతో, ఎంత దూరంలో ఉన్నారో, చూడడానికి ఎలా ఉంటారోతదితర వివరాలను కచ్చితంగా తెలుసుకునేందుకు ఉపయోగపడుతోందని, అందుకనే ఇది  డేటింగ్ యాప్స్‌లో ఎంతో ప్రాచుర్యం పొందుతోందని ఆమె చెప్పారు.



ఈ యాప్‌ను ఉపయోగించడం వల్ల 24 గంటల్లో దాదాపు రెండున్నర కోట్ల మంది ప్రేమ జంటలవుతున్నారని, వారిలో 16 ఏళ్ల నుంచి 24 ఏళ్లలోపు యువతీ యువకులు 38 శాతం ఉండగా, 25 ఏళ్ల నుంచి 34 ఏళ్ల లోపువారు 45 శాతం మంది, 45 ఏళ్ల పైబడిన వారు కేవలం నాలుగు శాతం మంది ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలిందని లూజీ వివరించారు. ఈ యాప్ కారణంగా ఒక్కరోజు భార్యా భర్తలుగా గడిపిన వారు కూడా ఎక్కువే ఉన్నారని ఆమె అన్నారు. ప్రేమ పుస్తకాలను చదివే ఓపిక, తీరిక నేటి యువతరానికి లేకుండా పోయిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top