అమెరికా అధికారుల కస్టడీలో భారతీయుడి మృతి

అమెరికా అధికారుల కస్టడీలో భారతీయుడి మృతి - Sakshi


అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల కస్టడీలో ఉన్న ఓ భారతీయుడు అక్కడే ఆస్పత్రిలో మరణించారు. అతుల్ కుమార్ బాబూభాయ్ పటేల్ (58)ని దేశంలోకి వచ్చేటప్పుడు తగిన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేవంటూ అధికారులు గత వారం అదుపులోకి తీసుకున్నారు. మే పదో తేదీన ఈక్వెడార్ నుంచి వచ్చిన ఓ విమానంలో ఆయన అట్లాంటాలో దిగారు. రెండు రోజుల పాటు అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆయనను అట్లాంటాలోని సిటీ డిటెన్షన్ సెంటర్‌లోనే ఉంచేశారు. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా ఆయన మరణించారని అధికారులు తెలిపారు.



పటేల్ వద్ద తగిన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకపోవడం వల్లే ఆయనను దేశంలో అడుగుపెట్టేందుకు అనుమతించలేదని ఇమ్మిగ్రేషన్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అట్లాంటాలోని సిటీ డిటెన్షన్ సెంటర్‌లో ఉండగా ఆయనకు ప్రాథమిక వైద్యపరీక్షలు చేసినప్పుడు హైబీపీ, డయాబెటిస్ ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఆయన డయాబెటిస్ చూస్తున్న ఓ నర్సు.. ఆయనకు ఊపిరి అందడం లేదని చెప్పడంతో ఆస్పత్రికి తరలించగా, అక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు. భారతీయ రాయబార కార్యాలయానికి పటేల్ మృతి గురించి సమాచారం అందించగా, వాళ్లు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. కస్టడీలో ఇలా మరణించడం చాలా అరుదుగా జరుగుతుందని ఇమ్మిగ్రేషన్ శాఖ చెబుతోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top