కిక్కిరిసిన ఆసుపత్రులు.. నేలపైనే చికిత్సలు
ఎక్కడ విన్నా పిల్లలు, వృద్ధుల ఆర్తనాదాలు.. క్షతగాత్రులందరికీ ఆవరణలోనే చికిత్సలు.. తీవ్రంగా గాయపడినవారికి మాత్రమే పడకలు.. అవి కూడా పరిమిత సంఖ్యలో.. ఇవీ.. మొత్తంగా నేపాల్ దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో నెలకొన్న హృదయవిదారక దృశ్యాలు! ఈ విపత్కర పరిస్థితిలో నేపాల్ ప్రజలను ఆదుకునేందుకు అన్నివిధాలా శ్రమిస్తున్న భారత్ ఆదివారం నాటికి 43 టన్నుల అత్యవసర సామాగ్రిని ఖాట్మండుకు తరలించింది.
ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఆహారం, వైద్య సామాగ్రిని తరలించారు. మరోవైపు ప్రపంచ దేశాల నుంచి కూడా సహాయక బృందాలు నేపాల్ కు చేరుకుంటున్నాయి. అమెరికా, యురోపియన్ యూనియన్ నుంచి టీమ్స్ వస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు ప్రకటించారు. నేపాల్ కేంద్రంగా సంభవించిన భూకంపం.. దాదాపు 66 లక్షల మందిపై ప్రభావం చూపిందని పేర్కొన్నారు.