ట్రంప్ మీద హిల్లరీదే పై చేయి
అమెరికా అధ్యక్ష పదవికి ఎవరెవరు పోటీ పడతారో తెలిసిపోయింది. ఇక ఇద్దరిలో ఎవరిది పైచేయి అనే విషయాన్ని నిర్ణయించడానికి చేసిన సర్వేలలో.. డోనాల్డ్ ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్దే పైచేయి అని తేలింది. వాషింగ్టన్ పోస్ట్ - ఏబీసీ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీకి.. రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కంటే 12 పాయింట్ల ఆధిక్యం కనపడింది. ఈరోజుకు ఈరోజే అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే.. తాము హిల్లరీకి ఓటేస్తామని 51 శాతం మంది చెప్పగా, ట్రంప్ తరఫున ఉన్నవాళ్లు 39 శాతం మందేనని తేలింది. ఇక వాల్స్ట్రీట్ జర్నల్ - ఎన్బీసీ న్యూస్ నిర్వహించిన పోల్లో ఇంత ఎక్కువ తేడా లేకపోయినా, అక్కడ కూడా హిల్లరీ క్లింటన్కే ఆధిక్యం దక్కింది. హిల్లరీకి 46 శాతం, ట్రంప్కు 41 శాతం మంది మద్దతు కనిపించింది.
ఇదే పరిస్థితి చివరి వరకు కొనసాగితే మాత్రం.. వివాదాస్పద వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించిన డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోకి వెళ్లడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలే ఆయన తన పార్టీ ప్రచార మేనేజర్ను కూడా తొలగించారు. నిధుల సేకరణలో కూడా ట్రంప్ కంటే హిల్లరీ చాలా ముందున్నారు. ఆర్లాండోలోని గే నైట్ క్లబ్బులో కాల్పులు జరిగిన తర్వాత కాల్పులు జరిపిన వ్యక్తిని అభినందిస్తూ ట్రంప్ ట్వీట్ చేయడం కూడా పలువురికి అసంతృప్తి కలిగించింది. ముస్లింలు అమెరికాలోకి రాకుండా అడ్డుకోవాలని కూడా ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ట్రంప్ ఇలాంటి తప్పులు చాలా చేశారని, గత కొన్నివారాలుగా ఇలా చేయడం వల్లే వెనకబడ్డారని రిపబ్లికన్ పార్టీ నాయకుడు మిచ్ మెక్ కానెల్ అన్నారు. అయితే ఇంకా నవంబర్ వరకు చాలా సమయం ఉందని, అప్పటికి పరిస్థితులు మారొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.