ముష్కరులను ఏరిపారేస్తాం: షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని ముష్కర మూకలన్నింటినీ ఏరిపారేస్తామని ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరు ఆగబోదని పేర్కొన్నారు. ఆదివారం చైనా ప్రతినిధి బృందంతో భేటీతో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.
ఉత్తర వజీరిస్తాన్లో ఉగ్రవాదులపై జరుపుతున్న సైనిక దాడులు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. కాగా, పాక్ భద్రతా బలగాలు తాజాగా ఇస్లామాబాద్లో 300 మందికి పైగా అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. మళ్లీ ఉగ్రవాదులు విరుచుకుపడొచ్చన్న నిఘా వర్గాల సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నారు.
భారీ ఎత్తున మందుగుండు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇస్లామాబాద్లోని పలు విద్యాసంస్థలకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు తెలపడంతో.. పలు విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసేశారు.