ప్రాణాలకు తెగించే మహిళా దళం
బాగ్దాద్: ఇరాక్లోని ఐసిస్ టెర్రరిస్టుల ప్రాబల్య ప్రాంతంలో లైంగిక బానిసలుగా చస్తూ బతకడంకంటే వారిని ఎదురొడ్డి ప్రాణాలర్పించైనా సరే తమ జాతి కుటుంబాలకు విముక్తి సాధించడమే ముఖ్యమని భావించారు యాజిదీ యువతులు. అందుకోసం తుపాకులు చేతపట్టారు. ఓ మహిళా బ్రిగేడ్ను స్థాపించారు. కుర్దిస్థాన్ కోసం పోరాటం జరుపుతున్న ‘పెష్మెర్గా’ సైనికుల సహాయ సహకారాలతో యుద్ధ విద్యలో ఆరితేరుతున్నారు. ఇప్పటికే ఆయుధ విద్యలో శిక్షణ పొందిన 123 మంది యువతులు మహిళా బ్రిగేడ్లో సభ్యులుగా ఉన్నారు. మరో 500 మంది ఈ సైన్యంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఐసిస్ టెర్రరిస్టుల కబంధ హస్తాల నుంచి సింజార్ ప్రాంతాన్ని విముక్తం చేయడంలో కుర్దిష్ పెష్మెర్గా సైనికులకు ఈ మహిళా బ్రిగేడ్ ఎంతో తోడ్పడింది.
ఇప్పుడు మోసుల్ పట్టణాన్ని కూడా టెర్రరిస్టుల నుంచి విముక్తం చేయాలన్నది వీరి ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్య సాధన దిశగా దూసుకుపోవడం కోసం మోసుల్ సరిహద్దుల్లో మోహరించి ఆ ప్రాంతానికి కాపలా కాస్తోంది. మోసుల్ పట్టణాన్ని తాము స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాకపోయినప్పటికీ ప్రాణ త్యాగం చేసైనా సరే లక్ష్యాన్ని సాధిస్తామని, యాజిదీ, ఇతర మైనారిటీ తెగలను విముక్తం చేస్తామని మహిళా బ్రిగేడ్ కెప్టెన్ ఖతూన్ ఖైదర్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఫోర్స్ ఆఫ్ ది సన్ లేడీస్’ అని కూడా తమ బ్రిగేడ్కు నామకరణం చేసినట్టు ఆమె చెప్పారు.
మోసుల్లో ఐసిస్ టెర్రరిస్టులను ఎదుర్కొనేందుకు ఇరాక్ ప్రభుత్వ సైనికులు సిద్ధంగా లేకపోయినప్పటికీ తాము అందుకు సిద్ధంగా ఉన్నామని ఖైదర్ తెలిపారు. ఐసిస్ టెర్రరిస్టుల నుంచి సింజార్ పర్వత ప్రాంతాన్ని విముక్తం చేయడం ద్వారా ఇంతవరకు దాదాపు 2000 మంది యాజిది మహిళలకు విముక్తం చేశారు. ఐసిస్ ప్రాబల్య ప్రాంతాల్లో ఇప్పటికీ 3,500 మంది మహిళలు, బాలికలు లైంగిక బానిసలుగా బతుకుతున్నారని ఐక్యరాజ్య సమితి అంచనాలు తెలియజేస్తున్నాయి.