తప్పైపోయిందంటూ.. లెంపలేసుకున్న ఫేస్బుక్
పాలస్తీనాకు చెందిన పలువురు జర్నలిస్టులు, ఇతరుల అకౌంట్లను డిజేబుల్ చేసినందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ చెంపలేసుకుంది. పొరపాటున ఆ పేజీలను తీసేశారని.. తమకు ఆ విషయం తెలియగానే వెంటనే వాటిని పునరుద్ధరించామని తెలిపింది. పాలస్తీనా జర్నలిస్టులు, ప్రచురణ సంస్థల అకౌంట్లను డిలీట్ చేయడంతో ఫేస్బుక్కు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ప్రచారం మొదలైంది. ప్రతివారం తమ బృందం లక్షల కొద్దీ రిపోర్టులను ప్రతివారం ప్రాసెస్ చేస్తుందని, కొన్నిసార్లు పొరపాటు జరుగుతుందని.. ఈ తప్పునకు మాత్రం తాము చాలా బాధపడుతున్నామని ఫేస్బుక్ అధికార ప్రతినిధి అల్ అరబియా ఇంగ్లీష్ చానల్కు తెలిపారు.
ఫేస్బుక్ అకౌంట్లు డిజేబుల్ కావడంతో ఒక్కసారిగా పాలస్తీనాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. బ్లాగర్లు దీనిపై ఆన్లైన్ ప్రచారం మొదలుపెట్టారు. అసలు ఫేస్బుక్లో ఎవరూ ఏమీ పోస్ట్ చేయొద్దని కోరారు. ప్రభుత్వాలకు, ఫేస్బుక్ యంత్రాంగానికి మధ్య ఎలాంటి ఒప్పందాలున్నాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇంటర్నెట్ యూజర్ల వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించొద్దని ఫేస్బుక్కు సూచించారు. ఇజ్రాయెలీ ప్రభుత్వ సూచనల వల్లే తమ అకౌంట్లు డీయాక్టివేట్ అయ్యాయని ఆరోపించారు.