ఇక విమానంలో ఫోన్ స్విచాఫ్ చేయక్కర్లేదు!

ఇక విమానంలో ఫోన్ స్విచాఫ్ చేయక్కర్లేదు!


 ఫ్లైట్ మోడ్‌లో వాడుకోవచ్చన్న డీజీసీఏ

 న్యూఢిల్లీ: విమానం పైకి ఎగిరే సమయంలో ఎయిర్‌హోస్టెస్ వస్తుంది.. ‘‘దయచేసి మీ మొబైల్ ఫోన్‌ను స్విచాఫ్ చేయండి’’ అని అంటుంది... ఇంతవరకు భారత్‌లో ఏ విమానం ఎక్కినా ఇదే సీన్. కానీ ఇక నుంచి సీన్ మారబోతోంది. ‘‘దయచేసి మీ మొబైల్ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోండి’’ అని ఎయిర్‌హోస్టెస్ అనబోతోంది!! పౌర విమానయాన డెరైక్టరేట్(డీజీసీఏ) బుధవారం ఈ మేరకు నిబంధనలు సవరించింది. కొత్త నిబంధల ప్రకారం.. పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైజ్‌లు(పీఈడీలు).. అంటే సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు వంటి వాటిని విమానం ఎగిరే సమయంలో ఫ్లైట్ మోడ్(నాన్ ట్రాన్స్‌మిటింగ్ మోడ్)లో ఉపయోగించుకోవచ్చు.

 

 ఇలా ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోవడం వల్ల మన హ్యాండ్‌సెట్ నుంచి కాల్స్ చేసుకోలేకపోవచ్చు, ఈమెయిల్స్ పంపుకోలేకపోవచ్చు, నెట్ వాడుకోలేకపోవచ్చుగానీ.. గేమ్స్ ఆడుకోవచ్చు, ఈమెయిల్స్ టైప్ చేసుకోవచ్చు, ఫొటోలు, వీడియోలు, సినిమాలు చూసుకోవచ్చు. పలు విమానాల్లో వేరే వినోదమేదీ ఉండని దృష్ట్యా ప్రయాణికుల ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఫోన్లలో ఫ్లైట్ మోడ్‌ను అనుమతించాలని చాలా కాలంగా పలు విమానయాన సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీల నిబంధనలు పరిశీలించిన అనంతరం డీజీసీఏ తాజా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు దేశాలు ఈ సౌకర్యం వాడుకోవడానికి అవకాశమిస్తున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top