హిల్లరీ, ట్రంప్ ముఖాముఖి రేపు

హిల్లరీ, ట్రంప్ ముఖాముఖి రేపు - Sakshi


ఇద్దరి మధ్య తీవ్ర పోటీ: సర్వే


 వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతున్న డెముక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లు మంగళవారం తమ తొలి అధ్యక్ష అభ్యర్థుల చర్చాగోష్ఠిలో పాల్గొననున్నారు. ఇలాంటివి మొత్తం మూడు చర్చాగోష్ఠిలు ఉంటాయి. గెలవడానికి ఇద్దరికీ సమానావకాశాలు ఉన్నాయనీ, ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొందని వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్‌లో తేలింది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయమే ఉంది.


పోటీలో క్లింటన్, ట్రంప్‌లను మాత్రమే పెట్టి..మీరు ఎవరిని ఎన్నుకుంటారని అందరు ఓటర్లనూ సర్వే చేసినపుడు ట్రంప్ కన్నా క్లింటన్ 2 పాయింట్లు మాత్రమే ముందున్నారు. అదే నమోదిత ఓటర్లతో మాత్రమే చేసిన సర్వేలో ఇద్దరికీ సమాన పాయింట్లు లభించాయి. నలుగురు అభ్యర్థులను పోటీలో పెట్టి నమోదిత ఓటర్లతో మాత్రమే సర్వే నిర్వహించినపుడు కూడా క్లింటన్, ట్రంప్‌లకు సమాన పాయింట్లే వచ్చాయి. అదే అందరు ఓటర్లను ప్రశ్నించినపుడు మాత్రం మళ్లీ హిల్లరీ ట్రంప్ కన్నా 2 పాయింట్లు ముందంజలో ఉన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top