అమెరికాలో కన్నా భారత్‌లోనే ఎక్కువట!

అమెరికాలో కన్నా భారత్‌లోనే ఎక్కువట! - Sakshi


న్యూయార్క్: ఢిల్లీ నగరంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు చర్యలు తీసుకున్న విషయం తెల్సిందే. డీజిల్ కార్ల రిజిస్ట్రేషన్లను నిషేధించడం, రోడ్లపై వాహనాల రాకపోకలను తగ్గించేందుకు సరిబేసి సంఖ్య విధానాన్ని అమలు చేయడం లాంటి చర్యలు తీసుకున్నాయి. వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇలాంటి చర్యలు ఏ మాత్రం సరిపోవని వాతావరణ కాలుష్యానికి సంబంధించి నాసా శాటిలైట్ తీసిన ఛాయాచిత్రాలు ఏ మాత్రం చాలవని నిరూపిస్తున్నాయి.



వర్షాకాలం ముగిశాక అక్టోబర్ నెల నుంచి జనవరి మధ్య కాలంలో తూర్పు పాకిస్తాన్ నుంచి ఉత్తర భారత దేశం, బంగ్లాదేశ్‌లోని సరిహద్దు ప్రాంతాలను వాతావరణ కాలుష్యం కమ్మివేస్తోందని, ఈ కాలుష్యం సూర్యుడి కిరణాలను గణనీయంగా అడ్డుకుంటోందని నాసా ఉపగ్రహం తీసిన ఛాయా చిత్రాలు సూచిస్తున్నాయి. భారత్‌లోని ఉత్తరాది ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యం పీఎం 2.5 రేణువులగా ఉందని మేరిల్యాండ్‌లోని ‘గాడర్డ్ ఎర్త్ సెన్సైస్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్ గ్రీన్‌ల్యాండ్’కు చెందిన శాస్త్రవేత్త పవన్ గుప్తా తెలిపారు.



ఉత్తర భారత దేశంలోని మైదాన ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటోందని, అమెరికాతో పోలిస్తే సూర్య కిరణాలను ఇక్కడి వాతావరణ కాలుష్యం పది రెట్లు అడ్డుకుంటోందని పవన్ గుప్తా చెప్పారు. 2008 నుంచి 2014 మధ్య నాసా శాటిలైట్ తీసిన చిత్రాలను విశ్లేషించడం ద్వారా ఈ విషయం స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. ఎండకాలంలో థార్ ఎడారి నుంచి ఎగిసిన ఇసుక రేణువులు కూడా సూర్య కిరణాలను ఎనిమిది రెట్లు అడ్డుకుంటోందని ఆయన వివరించారు.



పాకిస్తాన్‌లోని పెషావర్ నుంచి ఇటు భారత్‌లోని ఢిల్లీ వరకు, అటు బంగ్లాదేశ్‌లోని నారాయణ్ గంజ్ వరకు వాతావరణం కాలుష్యం ఎక్కువగా ఉందని నాసా చిత్రాలు సూచిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఈ బెల్ట్‌లోని మైదాన ప్రాంతాల్లో దాదాపు 30 నగరాలు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే ప్రకటించింది. ఈ కాలుష్యం వల్ల శ్వాసకోస సంబంధిత వ్యాధులే కాకుండా కార్డియో వ్యాస్కులర్ జబ్బులు కూడా వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.



అమెరికా పారిశ్రామిక రంగం నుంచి కర్బన ఉద్గారాలు భారత్ కన్నా ఎన్నో రేట్లు ఎక్కువగా వెలువడుతాయి. అలాంటప్పుడు అమెరికా కన్నా భారత్ వాతావరణంలో కాలుష్యం పాళ్లు ఎక్కువని చెప్పడం అనుమానించాల్సిన విషయమే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top