ఒకేచోట 3800 జంటలు
దక్షిణ కొరియాలోని ఓ చర్చి ప్రాంగణం తెలుపునలుపు వర్ణాలతో కళ్లు చెదిరేలా కనిపించింది. అందుకు ప్రధాన కారణం 3800 జంటలు ఒకే చోట చేరారు. మరోసారి ఒకరికొకరు చేతిలో చేయివేసుకొని వాగ్దానం చేసుకుంటూ నాకు నువ్వు నీకు నేను అని వారి తరహాలో సరిగమలు పాడుకున్నారు. అంతకుముందే జరిగిన తమ వివాహ వేడుకలను మరోసారి గుర్తుచేసుకున్నారు. దక్షిణ కొరియాలోని గ్యాపియాంగ్లో సన్ మియంగ్ మూన్ అనే వ్యక్తి 1954లో యూనిఫికేషన్ చర్చిని నిర్మించారు. ఆయన నిమోనియాతో 2012లో చనిపోయారు.
మియంగ్ మూన్ ను మెస్సయ్యగా భావించే స్థానిక క్రైస్తవులు ఆయన చనిపోయి మూడో సంవత్సరం సందర్భంగా ఓసారి గుర్తు చేసుకొని తమ అభిమానం తెలుపుకునేందుకు ఆ చర్చి వద్దకు భారిగా తరలి వచ్చారు. అందుకోసం వివాహం నాటి దుస్తులు వేసుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో యువజంటలే అధికంగా ఉన్నాయట. మియాంగ్ భార్య హక్ జా హాన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతేకాదు, ఈ కార్యక్రమానికి వచ్చిన జంటలన్నీ కూడా ఈ చర్చిలోనే తమ వివాహాలు చేసుకున్నారంట.