అప్పటికిక భార్య పాత్రే ఉండదట..!
వచ్చే 2050 నాటికి ఇక హౌస్ వైఫ్ లూ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు నిపుణులు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రతి పనిని రోబోట్లతో చేయించుకోవడంతోపాటు... యాండ్రాయిడ్లు, కంప్యూటర్ల కాలం నడుస్తున్న నేటి తరుణంలో.. వంటా వార్పూ, ఇంటి పనులను బాధ్యతగా చేసే హౌస్ వైఫ్ లు ఇకపై కనిపించే అవకాశం ఉండదంటున్నారు ఫ్యూచరాలజిస్టులు.
బట్టలు ఉతకడం, ఇంటిపనులు.. వంట పనులు చేయడం భార్యల పనిగా భావించే కాలం ఇప్పటికే కనుమరుగైపోయింది. దీంతో రోబోట్లను కొనుక్కొని వంట చేయించుకోవాల్సిన పరిస్థితులు దగ్గరలోనే కనిపిస్తున్నాయని ఫ్యూచరాలజిస్ట్ డాక్టర్ ఇయాన్ పియర్సన్ చెప్తున్నారు. వచ్చే 34 ఏళ్ళలో 80 శాతం ఇళ్ళలో రోబోట్ సర్వెంట్లే ఉంటాయంటూ ఆయన భవిష్య వాణిని వినిపిస్తున్నారు. నాలుగ్గోడల మధ్యా ఇంటి పనులు వంట పనులతో పాటు భర్తా, పిల్లల బాధ్యతలను భుజాని కెత్తుకొనే భార్య పాత్రలో ఇప్పటికే ఎంతో మార్పు వచ్చిందని, రాబోయే కాలంలో హౌస్ వైఫ్ లుగా ఆండ్రాయిడ్లే చెలామణి అవుతాయని చెప్తున్నారు.
ఇంటిని శుభ్రపరచడం, మార్కెట్ పనులతోపాటు అన్నీరోబోలే చేస్తాయని ఇయాన్ జోస్యం చెప్పారు. ఇప్పటికే చాలామంది మహిళలు వివాహానంతరం భార్య పాత్రతో పాటు.. ఉద్యోగినిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ.. కొంత వరకూ భర్తలతోనే పనులు చేయించుకునే పరిస్థితులు చూస్తే... భవిష్యత్తులో ఇయాన్ మాటలకు కాస్త బలం చేకూరేట్లే కనిపిస్తోంది.