చంద్రబాబు వ్యాఖ్యలపై అభ్యంతరం
హైదరాబాద్: ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వివరణకు ఇచ్చేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. స్పీకర్ తిరస్కరించడంతో ఆందోళన చేపట్టారు. విభజన సమయంలో లోక్ సభలో కాంగ్రెస్ పై అవిశ్వాసం పెట్టి ఎందుకు ఉపసంహరించుకున్నారో వైఎస్సార్ సీపీ నేతలు చెప్పాలని చంద్రబాబు అనడంతో సభలో గందరగోళం రేగింది.
చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. సభా నేత ప్రకటన చేస్తున్నప్పుడు ప్రశ్నలకు అవకాశం లేదని యనమల రామకృష్ణుడు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సభా సమయం పూర్తయ్యాక అభ్యంతరాలు చెప్పవచ్చని అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వం చేసిన ప్రకటన కాపీలు కూడా తమకు ఇవ్వలేదని వైఎస్సార్ సీపీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.