ఆ మరణాలపై విచారణ చేయాలి

ఆ మరణాలపై విచారణ చేయాలి - Sakshi


వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌



సాక్షి, హైదరాబాద్‌: కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థుల మరణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థులు చనిపోవడం తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగుల్చుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  గుంటూరులో వంశీకృష్ణ అనే విద్యార్థి మరణిస్తే దాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలచి వేస్తోందన్నారు.



ఆ ప్రాధాన్యత ఎందుకో?

‘‘రాష్ట్రమంతటా నారాయణ, శ్రీచైతన్య స్కూళ్లే ఉండాలా? సర్కారు ఉచిత విద్యను అందిస్తున్నా విద్యార్థులు కార్పొరేట్‌ స్కూళ్ల పైపు మొగ్గు చూపడానికి ప్రభుత్వ విధానాలే కారణం. ప్రభుత్వ పెద్దలకు ఆర్థిక వనరులు చేకూర్చే సంస్థలుగా ప్రైవేటు స్కూళ్లు తయారయ్యాయి. బినామీ పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్‌ విద్యా సంస్థలు స్వర్గధామంగా మారాయి కాబట్టే ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో భూముల వ్యవహారాలు, పెద్ద వ్యాపారాల్లో ‘ముఖ్య’నేతకు బినామీ ఎవరంటే నారాయణే అని చిన్నపిల్లలు కూడా చెబుతారు.



నారాయణ వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉండటంతో వీరంతా ఒక్కటై విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు’’ అని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. విద్యార్థుల మరణాలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తే వైఎస్సార్‌సీపీ తోడుగా నిలుస్తుందన్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా లేవనెత్తుతామన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top