'సీఎంపై అట్రాసిటీ కేసు పెట్టాలి'

'సీఎంపై అట్రాసిటీ కేసు పెట్టాలి'


హైదరాబాద్: ఎస్సీలను అవమానిస్తూ చంద్రబాబు చేసిన ప్రకటనతో దళితులు మనోవేదనకు గురవుతున్నారని వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే కె. శ్రీనివాసులు అన్నారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని పేర్కొన్నారు. తక్షణం రాజీనామా చేసి దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథితో కలిసి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు.



కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులపై కపటప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. దళితులను ఎన్నికల్లో వాడుకుని వదిలేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని చంద్రబాబు హేళన చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ దళిత నేతలు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని సూచించారు. దళితులను అవమానించేలా మాట్లాడిన చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు.



కాపులను, బీసీలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని పార్థసారథి ఆరోపించారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చొద్దని హితవు పలికారు. బీసీలకు నష్టం జరగకుండా కాపులను ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top