బాబూ.. బేషరతుగా క్షమాపణలు చెప్పు

బాబూ.. బేషరతుగా క్షమాపణలు చెప్పు - Sakshi


వైఎస్సార్‌సీపీ నేత నల్లా సూర్యప్రకాశ్ డిమాండ్



 సాక్షి, హైదరాబాద్: కుల వివక్షాపూరిత వ్యాఖ్యలు చేసినందుకు ఏపీ సీఎం చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, తెలంగాణ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ డిమాండ్‌చేశారు. తన వ్యాఖ్యలతో బాబు ఎస్సీలను అవమానించారని మండిపడ్డారు. క్షమాపణ చెప్పకుంటే.. కోర్డులు, ఉభయ రాష్ట్రాల్లోని పోలీస్‌స్టేషన్లలో చంద్రబాబుపై కేసులు పెడతామని హెచ్చరించారు. 



మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు ఎం. గవాస్కర్‌రెడ్డి, రవికుమార్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎంపై పరువు నష్టం కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే విషయంపై పార్టీ లీగల్ విభాగాన్ని, న్యాయవాదులను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ప్రతి చిన్న విషయంపై వైఎస్సార్‌సీపీ నేతలు, ఎమ్మెల్యేలపై ఏపీలో ఎస్సీ, ఎస్టీ కేసులను పెడుతున్నారని, చంద్రబాబు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను పాలతో శుద్ధి చేసి చంద్రబాబుకు నిరసనలు తెలపాలని దళితులకు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. పెద్ద ఫ్యూడలిస్టుగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు దళితులు తమ మధ్యనున్న తరతమ భేదాలను మరచి సంఘటితమై నిలబడాలని కోరారు. గతంలో అమ్మాయిలు వద్దని, అబ్బాయిలనే కనాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఈ విధంగా మాట్లాడడం బాబుకు నైజంగా మారిందని ధ్వజమెత్తారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top