'మీరు మాతో గొంతెత్తగలరా?'


హైదరాబాద్: పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రైతుల సమస్యలు, తుఫాను, కరువు, గిట్లుబాటు ధరలు అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతాం అని చెప్పారు. టీడీపీ ప్రత్యేక హోదాపై మాట్లాడుకుండా ప్రత్యేక ప్యాకేజీ అడుగుతుందని, పోరాడి సాధించుకుందామన్న ధ్యాస టీడీపీకి లేదని చెప్పారు. పార్లమెంటులో ప్రత్యేక హోదాపై తమ పోరాటంతో కలిసి వస్తారా అని బొత్స టీడీపీని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిపై విచారణ ఎక్కడ జరుపుతారోనన్న భయంతోనే కేంద్రంతో టీడీపీ పోరాటం చేయడం లేదని అన్నారు.



బాక్సైట్ మైనింగ్ జీవోను ఎందుకు చంద్రబాబు రద్దు చేయడం లేదని, అసలు ఆ జీవోనే తెలియదని మాట్లాడుతున్న బాబుకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. బాధ్యతగల ముఖ్యమంత్రి ఇలాగేనా మాట్లాడేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాక్సైట్ విషయంలో ముడుపులు ఎంతమేరకు అందాయయని ప్రశ్నించారు. బాక్సైట్ పై శ్వేత పత్రం విడుదల చేసిన మాదిరిగానే బాక్సైట్ వెనుక ఉన్న అవినీతిపై ఒక పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.



ఎంతసేపు అవినీతి సొమ్ము ఎలా వస్తుంది, ఏ చర్యల ద్వారా వస్తుందనే ఆలోచనే తప్ప చంద్రబాబునాయుడికి వేరే ఆలోచనే లేదని ఆరోపించారు. ఎందులో అవినీతికి అవకాశం ఉంటే ఆ పనే చంద్రబాబు చేస్తారని మండిపడ్డారు. రాష్ర్టానికి సంబంధించిన ఏ అంశాన్ని కూడా సీరియస్ గా వారు పార్లమెంటులో ప్రస్తావించేలా కనిపించడం లేదని అన్నారు. విశాఖ రైల్వే జోన్ పై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top