ఒక్క ఉద్యోగమైనా భర్తీ చేశారా: పార్థసారధి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి ధ్వజమెత్తారు. దోపిడీ దొంగలు సమావేశమైనట్లుగా కేబినెట్ భేటీ జరుగుతోందని ఆయన విమర్శించారు. దోచుకునేందుకే కేబినెట్ భేటీ అయిందని మండిపడ్డారు. సోమవారం ఆయన లోటస్ పాండ్లో పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబు వ్యవహార శైలి సంక్షేమ పథకాలకు కోతపెట్టే విధంగా ఉందన్నారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పార్థసారధి పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా ఇప్పటివరకూ ఒక్క నోటిఫికేషన్ అయినా విడుదల చేశారా అని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా అడిగారు. ఏపీలో ప్రజలంతా అశాంతితో కాలం నెట్టుకు వస్తున్నారని ఆయన అన్నారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం అయినా భర్తీ చేశారా అని పార్థసారధి అన్నారు. ఉద్యోగాలు రాక దాదాపు నాలుగువేల మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని వార్తలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ఎవరైనా చావండి మాకేంటి సంబంధం అన్న చందాన ప్రభుత్వం వ్యవహరిస్తోందని పార్థసారధి వ్యాఖ్యానించారు. దాదాపు 28 లక్షలమంది నిరుద్యోగులు .. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.