కరువు పట్టని సర్కారుపై సమరం

కరువు పట్టని సర్కారుపై సమరం - Sakshi


2న మండల, నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ధర్నాలు

పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి వెల్లడి

మాచర్లలో ధర్నాకు హాజరుకానున్న వైఎస్ జగన్

చంద్రబాబుకు మరొక రకమైన కరువొచ్చింది

బాబొస్తే జాబులు రాలేదు గానీ రాష్ట్రంలో కరువు నెలకొంది


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ పట్టనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా మే 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ప్రకటించారు. మండల, నియోజకవర్గ కేంద్రాల్లో, ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నాలు జరుగుతాయని,  గుంటూరు జిల్లా మాచర్లలో జరిగే నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో  కరువుతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.


కానీ చంద్రబాబుకు వేరే రకమైన కరువు వచ్చింది. రోజూ ఎంతమంది ఎమ్మెల్యేలు తమ వైపునకు వచ్చారో లెక్క చూసుకుని సంతోషపడుతున్నారే గానీ, కరువు దెబ్బకు ఎన్ని ప్రాణాలు పోతున్నాయో పట్టడం లేదు. పశుగ్రాసం, నీటి కొరతతో రోజూ ఎన్ని పశువులు చనిపోతున్నాయనే అంశాన్ని కూడా విస్మరించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, సమస్యలను పక్కదారి పట్టించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు..’ అని పార్థసారథి దుయ్యబట్టారు.


 కార్యాచరణ ప్రణాళిక ఏదీ?

వేసవిలో వచ్చే కరువును ఎలా ఎదుర్కోవాలన్న దానిపై మార్చి నెలలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ప్రభుత్వ బాధ్యతని, కానీ, చంద్రబాబు సర్కారు ఏప్రిల్ ఆఖరులోనూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రజలను కలలో విహరింపజేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది గానీ, వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవడానికి సర్కారు వద్ద ఒక విధానం అంటూ లేదని విమర్శించారు. ‘నిన్న అధికార పార్టీ ఎంపీ ఒకరు మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలో అనంతపురం జిల్లాను చంద్రబాబు కోనసీమ కంటే పచ్చగా తయారు చేస్తారని అన్నారు.


కానీ ఈ రోజు కరువును ఎలా ఎదుర్కోవాలి. ఈ రోజు అనంతపురం జిల్లాలో తాగునీరు లేక ప్రజలు, పశువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎలా పరిష్కరిస్తారో మాత్రం ఆయన చెప్పలేదు..’ అని పార్థసారథి ఎద్దేవా చేశారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఇతర ప్రాంతాల నుంచి పశుగ్రాసాన్ని కొనుగోలు చేసి కరువు ప్రాంతాల్లో పంపిణీ చేసిందని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి , ఫిరాయింపులను ప్రోత్సహించడానికే పరిమితమైంది తప్ప ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో లేదని ధ్వజమెత్తారు. ‘బాబొస్తే జాబులు వస్తాయన్నారు. జాబులు రాలేదుగానీ.. కరువు, వర్షాలు లేని వాతావరణం మాత్రం చూస్తున్నాం’ అని అన్నారు.


 ప్రభుత్వ పెద్దల అవినీతిని ఎండగట్టాం..

రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అవినీతిని, రాజ్యాంగ ఉల్లంఘనలను జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైందని పార్థసారథి చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న తీరును, అవినీతికి పాల్పడుతున్న వైనాన్ని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లి జాతీయ పార్టీల నేతలను కలసి వివరించడం తప్పు ఎలా అవుతుందన్నారు. అధినేత వైఖరి నచ్చక పార్టీ మారుతున్నామని చెప్పే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందిగా చంద్రబాబును వైఎస్ జగన్ డిమాండ్ చేయడం నచ్చడం లేదా? అని ప్రశ్నించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top