వైఎస్సార్‌సీపీ ఆందోళన 8కి వాయిదా..

వైఎస్సార్‌సీపీ ఆందోళన 8కి వాయిదా.. - Sakshi


- చంద్రబాబు నయవంచనపై ఆరోజున పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు

- పార్టీ సీనియర్ నేత బొత్స వెల్లడి

 

 సాక్షి, హైదరాబాద్: ఏపీలో సీఎం చంద్రబాబు పరిపాలనకు రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన ప్రజలకు చేసిన మోసం, నయవంచనపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసే ఆందోళనను జూన్ 8కి వాయిదా వేసినట్లు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఆందోళనను తొలుత రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2నే చేయాలని భావిం చామని, అయితే పార్టీ జిల్లా నేతల సూచనల మేరకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో మంగళవారం జరిగిన ముఖ్య నేతల సమావేశంలో తేదీని మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 8న అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ పార్టీ శ్రేణులు సమావేశాలు నిర్వహించి, తర్వాత అక్కడే పోలీసు స్టేషన్లకు వెళ్లి చంద్రబాబు ప్రజలకు చేసిన వంచన, మోసంపై ఫిర్యాదులివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు.  



 ప్రతిదీ వ్యాపారమేనా బాబూ..?

 చంద్రబాబు ప్రతి అంశంలోనూ వ్యాపార దృక్పథంతోనే ఆలోచిస్తారని, చివరకు రాజ్యసభ ఎన్నికల్లోనూ వ్యాపారకోణంలోనే వ్యవహరించారని బొత్స దుయ్యబట్టారు. సంతల్లో పశువుల్లాగా ఒకవైపు ఎమ్మెల్యేలను కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేయడమేగాక, మరోవైపు రాజ్యసభ సభ్యత్వాలను ధనవంతులకు అమ్ముకున్నారని విమర్శించారు. ఇవి తామంటున్న మాటలు కావని, సాక్షాత్తూ టీడీపీ నేత పుష్పరాజ్ అన్నారని అన్నారు.నవనిర్మాణదీక్షపై అడిగిన ప్రశ్నకు బొత్స జవాబిస్తూ.. ‘అక్కడ నిర్మాణమే లేదు. ఇక దీక్ష ఎక్కడ’ అని వ్యాఖ్యానించారు. విభజన తరువాత అవశేషాంధ్రప్రదేశ్‌లో ఉన్న నిర్మాణాలను, వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు ధ్వంసం చేశారన్నారు.  

 రైల్వేజోన్ ఇవ్వండి: రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికవుతున్న కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు విశాఖపట్నానికి రైల్వేజోన్ వచ్చేలా సత్వర చర్యలు తీసుకోవాలని బొత్స విజ్ఞప్తి చేశారు.  తమ పార్టీ తరఫున ఎన్నికవబోతున్న విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రజలవాణిని వినిపించి రాష్ట్రప్రయోజనాల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తారన్నారు.



 విజయసాయిరెడ్డిపై వ్యాఖ్యలకు ఖండన

 విజయసాయిరెడ్డిని ఎ-టూ అని నిందిస్తూ బాబు మాట్లాడటంపై బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయిరెడ్డి విద్యావంతుడని, ఆయన డబుల్ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారన్నారు. ఆయన చార్టర్డ్ అకౌంటెంటే కాక, కంపెనీ సెక్రటరీ, ఎల్‌ఎల్‌బీ కోర్సులూ చదివారన్నా రు. అవినీతికి మారుపేరైన బాబు తనపై వచ్చే ఏ విచారణను ఎదుర్కోరని, చట్టంలోని లొసుగులతో స్టేలు తెచ్చుకోవడంలో ఘనాపాటని ఎద్దేవా చేశారు. బాబుకు దమ్ముంటే తనపై ఉన్న స్టేలన్నింటినీ ఉపసంహరించుకుని విచారణకు సిద్ధపడాలన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top