ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సనత్నగర్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం అర్ధరాత్రి 12 గంటలకు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ సనత్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి వెల్లాల రామ్మోహన్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. బర్త్ డే కేక్ కట్ చేసి, వైఎస్ జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెల్లాల మాట్లాడుతూ అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని ప్రజల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణబద్ధులై ముందుకు సాగుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ మెడలు వంచైనా ప్రజలకు న్యాయం చేయడమే పార్టీ అజెండా అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా పోరాటం వెనుక లక్షలాది మంది మద్దతు ఉందన్నారు. మహానేత వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న ఆయన ప్రజలకు మరింతగా సేవలు అందించేవిధంగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎలియాజర్, కమల్రాజ్, శివారెడ్డి, శ్రీకాంత్రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.