ప్రేమ పేరుతో వంచన..

ప్రేమ పేరుతో వంచన..


హైదరాబాద్: ప్రేమ.. పెళ్లి అంటూ బాలికను లోబర్చుకొని, తర్వాత ముఖం చాటేశాడో యువకుడు.  నిందితుడిని రెయిన్‌బజార్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిం చారు. ఇన్‌స్పెక్టర్ జి.రమేష్ కథనం ప్రకారం... యాకుత్‌పురా చావునీ నాదే అలీ బేగ్ ప్రాంతానికి చెందిన షేక్ షకీల్ కుమారుడు షేక్ నబీ అస్లాం అలియాస్ అస్లాం (20) ఇంటర్‌తో చదువుకు స్వస్తిచెప్పి పనీపాటా లేకుండా తిరుగుతున్నాడు. కాగా బాగ్‌హే జహేరా ప్రాంతానికి చెందిన బాలిక (17)ను ఏడాది నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్ని నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించాడు.





ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో గతనెల 9న అస్లాం కుటుంబసభ్యులను కలిశారు. బాలికకు 18 ఏళ్లు నిండాక అస్లాంతో పెళ్లి చేద్దామని ఇరువురి కుటుంబాల పెద్దలు నిర్ణయించారు.  అయితే, పెద్దల ముందు పెళ్లికి అంగీకరించిన అస్లాం ఆ తర్వాత నిరాకరించాడు. అంతేకాకుండా బాలికకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని తప్పుడు ప్రచారం చేసి, ఆమెను అప్రతిష్టపాల్జేశాడు.  దీంతో బాలిక తల్లిదండ్రులు గురువారం రెయిన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ 415, 417,420, 376 సెక్షన్ల కింద అస్లాంపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top