మహిళలే ఇంటికి మణిదీపాలు: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: మహిళలు ఇంటికి మణిదీపాలని, భారతీయ సమాజంలో వారిని మహాలక్ష్మిగా భావిస్తారని రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ఎన్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. మహిళలపై కుటుంబ భవిష్యత్తే కాదు, దేశ ప్రగతి కూడా ఆధారపడి ఉందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్స్(కోఠి) కళాశాల 90వ వార్షికోత్సవాలను గురువారం ఆయ న ప్రారంభించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ పిల్లలను విజ్ఞానవంతులుగా, ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో తండ్రికంటే తల్లి పాత్రే అధికమన్నారు. ఇల్లాలు చదువుకుంటే ఆ ఇం ట్లోని వారంతా విజ్ఞానవంతులవుతారని కొని యాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల అక్షరాస్యత శాతం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎంతో ఉత్తమమైందన్నారు. ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో చదువే కాదు మనిషికి కావాల్సిన సంస్కారం కూడా నేర్పుతున్నారన్నారు. కాలేజీ రోజుల్లో విద్యార్థులు అల్లరిచేయడం సహజమేనని, అయితే తమ జీవితమే అల్లరిపాలు కాకుండా చూసుకో వాల్సిన బాధ్య త ప్రతి విద్యార్థిపై ఉందన్నారు. ఆర్సీఐ డెరైక్టర్ జి.సతీష్రెడ్డి మాట్లాడుతూ మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులకు దీటుగా సంప్రదాయ ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులను అందించడం అభినందనీయమన్నారు. విద్యాప్రమాణాల విషయం లో రాజీపడకుండా 90 ఏళ్ల నుంచి రాణిస్తున్న కళాశాల ఏదైనా ఉందంటే అది ఇదొక్కటే కొనియాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ బి.టి.సీతాదేవి మాట్లాడారు.