అల్లుడి వేధింపులు తాళలేక..

పద్మావతి(ఫైల్‌ ఫోటో) - Sakshi


భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

బోడుప్పల్‌: అల్లుడు వేధింపులతో మనస్థాపానికి లోనైన ఓ మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్సై మహేందర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన కుంచన పద్మావతి(54) ప్రదీప్‌ దంపతులు చాలా ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చారు.



వీరి కుమార్తెను ఏడేళ్ల క్రితం రామంతాపూర్‌కు చెందిన చిట్టిప్రోలు హరిప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేశారు. గత ఐదేళ్లుగా ఖాళీగా ఉంటున్న హరిప్రసాద్‌ భార్య, పిల్లలను పుట్టింటికి తరిమేశాడు. తరచూ అత్తగారింటికి వచ్చి గొడవపెట్టుకోవడమేగాక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇటీవల పద్మావతి కుటుంబం ప్రశాంత్‌నగర్‌ కాలనీలో ప్లాట్‌ కొనుగోలు చేయగా అందులో తనకు వాటా ఇవ్వాలని గొడవపడ్డాడు.



ఈ క్రమంలో ఆదివారం అత్తగారింటికి వెళ్లిన అతను అత్త, భార్యను కొట్టి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం ఫోన్‌లో మరోసారి పద్మావతిని బెదిరించడంతో  మనస్థాపం చెందిన ఆమె అపార్టుమెంట్‌ 4వ ఫ్లోర్‌ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top