మహిళను చితకబాదిన స్మగ్లర్లు
హైదరాబాద్ : నగరంలోని నేరేడ్మెట్ ప్రాంతంలో శనివారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై గంజాయి స్మగ్లర్లు దాడి చేశారు. ఈ దాడిలో సదరు మహిళ తీవ్రంగా గాయపడ్డింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం... నేరేడ్మెట్ ప్రాంతంలో ఇటీవల గంజాయి తాగుతున్న వారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఆ గంజాయి మత్తులో రహదారిపై వెళ్తున్న వారిని పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దాంతో స్థానికంగా గంజాయి సేవించే వారిపై ఓ మహిళ ఇటీవల పోలీసులకు సమాచారం ఇచ్చింది. దాంతో ఆగ్రహించిన గంజాయి స్మగ్లర్లు ఆమెపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.